టాలీవుడ్ లో అలనాటి నటులు అందరూ కూడా ఒక్కొక్కరుగా ఈ లోకాన్ని వీడుతున్నారు. గత ఏడాది రెబల్ స్టార్ కృష్ణంరాజు, సూపర్ స్టార్ కృష్ణ మృతి చెందిన సంగతి తెలిసిందే. వారి మరణాన్ని ఇంకా వాటిని టాలీవుడ్ చిత్ర పరిశ్రమ మరువక ముందే ఇప్పుడు సీనియర్ హీరోయిన్ ఒకప్పటి అందాల నటి జమున కన్నుమూశారు. కర్ణాటకలో పుట్టిన ఆంధ్రాలో సెటిల్ అయ్యి సావిత్రి కారణంగా 15 ఏళ్ళ ప్రాయంలోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జమున హీరోయిన్ పలు చిత్రాలలో నటించింది. దశాబ్ద కాలం పాటు ఆమె టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఆ రోజుల్లో చలామణి అయ్యింది. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో సీత అంటే అంజలీదేవి ఎలా గుర్తుకోస్తారో అలాగే సత్యభామ అంటే గుర్తుకొచ్చే పేరు జమున.
అన్ని రకాల జోనర్స్ లో ఆమె ఎన్నో హిట్ చిత్రాలలో నటించింది. చలాకీ పాత్రలు వేయాలన్నా, పొగరుబోతు హీరోయిన్ పాత్రలలో మెప్పించాలన్నా, కంటతడి పెట్టించే పాత్రలలో నటించాలన్నా కూడా జమున తనదైన శైలిలో నటించి మెప్పించేది. ఒకానొక సమయంలో టాలీవుడ్ లో ఎన్టీఆర్, నాగేశ్వరరావుతో విభేదాల కారణంగా వారితో సినిమాలు చేయలేదు. స్టార్ హీరోలు అయిన వారిని కూడా ఏ మాత్రం లెక్కచేయకుండా ఉండే జమున తత్త్వం కారణం వారితో చాలా సినిమా ఛాన్స్ లని పోగొట్టుకుంది. అయినా కూడా ఏ మాత్రం తగ్గని మొండితనం ఆమెసొంతం.
వృద్ధాప్యంలో కూడా పలు సామాజిక, ఆద్యాత్మిక సంబంధ కార్యక్రమాలలో పాల్గొంటూ చాలా చలాకీగా జమున తిరుగుతూ ఉండేవారు. అయితే అనారోగ్యం కారణంగా ఆమె తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆమె రాజకీయాలలో కూడా అడుగుపెట్టి కాంగ్రెస్ పార్టీ తరపున 1989 నుంచి 91 వరకు రాజమండ్రి ఎంపీగా పని చేశారు. తరువాత బీజేపీలో చేరారు. తరువాత కొంతకాలానికి రాజకీయాలకి స్వస్తి చెప్పారు. ఆమె మరణం టాలీవుడ్ లో అందరిని దిగ్బ్రాంతికి గురి చేసింది. సినీ, రాజకీయ ప్రముఖులు జమున మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె కీర్తిని గుర్తుచేసుకున్నారు.