గత రెండు ఎన్నికలలో ఎలాంటి బలమైన పోటీ లేకుండా అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీకి ఈ సారి మాత్రం బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలంగాణలో అధికారంలోకి రావడానికి ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవడానికి బీజేపీ సిద్ధంగా లేదు. ముఖ్యంగాతెలుగు రాష్ట్రాలలో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న పవర్ ఈ సారి తెలంగాణలో బీజేపీ దక్కించుకునే దిశగా అడుగులు వేస్తుంది. తెలంగాణలో ముందుగా పవర్ లోకి వస్తే తరువాత ఏపీలో కూడా అధికారంలోకి రావడం సులభం అవుతుందనే ఆలోచనతో బీజేపీ అధిష్టానం ఉంది. ఈ నేపధ్యంలోనే బండి సంజయ్ కి ఫుల్ పవర్స్ ఇచ్చి బూత్ స్థాయిలో బలమైన కార్యవర్గాన్ని తయారు చేసే దిశగా అడుగులు వేయిస్తుంది.
ఇప్పటికే బీజేపీ ఎన్నడూ లేనంత బలంగా తెలంగాణలో ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కొంత మందిని తమ వైపుకి లాక్కుంటుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి నాయకులు తమ అనుచరగణంతో బీజేపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తర్వాత రాబోయే ఎన్నికలని దృష్టిలో ఉంచుకొని బీజేపీ మరింత బలంగా పని చేయాలని భావిస్తుంది. ఇందుకు గాను ప్రతి 15రోజులకి ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయాలని కూడా బీజేపీ అధిష్టానం భావిస్తుంది.
ఇక ఈ సభలకి ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఒకరి తర్వాత ఒకరుగా వస్తూ ఉండాలని ప్లాన్ చేసుకున్నారు. వీలైనన్ని ఎక్కువ సార్లు తెలంగాణలో పర్యటించి బీజేపీ సభలకి హాజరై తెలంగాణలో ప్రజలకి తాము ఏం చేయబోయేది చెప్పాలని భావిస్తున్నారు. స్పష్టమైన మేనిఫెస్టో, విధి విధానాలతో కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకి చేరువ కావడానికి వ్యూహాత్మకంగా బీజేపీ అధిష్టానం అడుగులు వేస్తున్నట్లుగా తెలంగాణ రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. ఇక కాంగ్రెస్ కి కోలుకునే అవకాశం అస్సలు ఇవ్వకూడదు అని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఈ నేపధ్యంలో కేసీఆర్ కి మాత్రం బీజేపీ నుంచి గట్టి ఫైట్ ఈ సారి తెలంగాణలో ఎదురవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.