ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి గత అసెంబ్లీ ఎన్నికలకి కొద్ది రోజుల ముందు హత్యకి గురయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వైసీపీ పార్టీ ఆ హత్యని రాజకీయంగా వాడుకుంది. టీడీపీ నాయకులే తన బాబాయ్ ని దారుణంగా హత్య చేసారని ప్రచారం చేశారు. ఇక ఈ హత్యతో ప్రమేయం ఉందని కొంతమంది టీడీపీ నాయకుల పేర్లు కూడా చెప్పారు. తన తండ్రిని చంపినట్లే బాబాయ్ ని కూడా టీడీపీ ప్రభుత్వం హత్య చేసింది అంటూ విస్తృతంగా ప్రచారం చేసి దానిని వాడుకున్నారు. ఇక వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కూడా వైసీపీ గెలుపుకి ఒక కారణం అయ్యిందని చెప్పాలి. ఇదిలా ఉంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసుని పూర్తిగా నీరుగార్చే ప్రయత్నం చేసిందని ప్రతిపక్షాల ఆరోపణ. సిట్ విచారణ పేరుతో కాలయాపన చేయడంతో వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత హైకోర్టుని ఆశ్రయించి సీబీఐ విచారణ కోరారు.
ఇక కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ అప్పటి నుంచి ఈ కేసు విచారణ చేపడుతుంది. ఇక కేసులో ప్రధాన నిందితులుగా ఎర్రా గంగిరెడ్డిని సీబీఐ గుర్తించింది. ఇక అతను కూడా అప్రూవర్ గా మారిపోయి సీబీఐకి కీలక విషయాలు తెలియజేశారు. దీంతో వైఎస్ వివేకానంద హత్యలో వైఎస్ అవినాష్ రెడ్డి, అతని తండ్రి భాస్కర్ రెడ్డి ప్రమేయం తెరపైకి వచ్చింది. అయితే సీబీఐ విచారణ మూడేళ్ళుగా కొనసాగుతున్న నిందితులు ఎవరనేది బయటపడలేదు. అయితే వైఎస్ అవినాష్ రెడ్డి ప్రమేయాన్ని అందరూ అనుమానిస్తున్నారు. సీబీఐ విచారణ కూడా ఆ దిశగానే సాగుతున్నట్లు కనిపిస్తుంది.
అయితే ముఖ్యమంత్రి జగన్ కి కేంద్రంలో బీజేపీతో ఉన్న సత్సంబంధాలతో వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణ. ఇదిలా ఉంటే ఈ కేసు విచారణలో భాగంగా తాజాగా సీబీఐ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ లో సీబీఐ ఆఫీస్ కి వచ్చి విచారణకి హాజరు కావాలని ఆదేశించింది. కొన్ని నెలల క్రితమే ఈ కేసు విచారణ ఏపీలో సక్రమంగా జరగడం లేదని వేరే రాష్ట్రానికి మార్చాలని సునీత అభ్యర్ధించింది. దీనిపై కోర్టు కూడా ఆమె కోరుకున్న విధంగా తెలంగాణకి మార్చింది. ఇప్పుడు ఈ కేసు విచారణ వేగవంతం అయ్యింది. అందులో భాగంగానే వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించబోతున్నారు.