బీఆర్ఎస్ పార్టీతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీలో రాజకీయాలు చేయాలని భావిస్తున్నారు. అందుకోసం వేదికని సిద్ధం చేసుకుంటున్నారు. విజయవాడలో ఏపీ పార్టీ ఆఫీస్ పెట్టడానికి సమాయత్తం అవుతున్నారు. మరో వైపు బీఆర్ఎస్ పార్టీలోకి బీసీ సామాజిక వర్గాల నుంచి కొంత మంది నాయకులు వచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. అలాగే ఏపీలో మూడు పార్టీలకి అతీతంగా ఇండిపెండెంట్ గా రాజకీయాలు చేస్తున్న నేతలపై ఫోకస్ పెట్టి వారిని బీఆర్ఎస్ పార్టీలోకి కేసీఆర్ ఆహ్వానిస్తున్నారు. అలా ఆహ్వానం అందుకున్న వారిలో హర్ష కుమార్, ఉండవల్లి అరుణ్ కుమార్, జేడీ లక్ష్మీనారాయణ వంటి నాయకులు ఉన్నారు. ఇదిలా ఉంటే ఏపీలో బీఆర్ఎస్ అడుగుపెట్టిన తర్వాత కేసీఆర్ కచ్చితంగా వైసీపీతో పెట్టుకొని ఎన్నో కొన్ని స్థానాలలో పోటీ చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది.
ముఖ్యంగా చంద్రబాబుని దెబ్బ కొట్టే వ్యూహంలో జగన్ కి కేసీఆర్ తోడయ్యే ఛాన్స్ ఉంది. ఇది గ్రహించిన టీడీపీ అధినేత చంద్రబాబు మరల తెలంగాణ టీడీపీని యాక్టివ్ చేసారు. ఖమ్మం వేదికగా శంఖారావం నిర్వహించారు. దీనికి అన్ని జిల్లాల నుంచి పెద్దఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఇక టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలో చంద్రబాబు సూచనల మేరకు చేరిన కరుడుగట్టిన టీడీపీ వాదులని మరల తెలంగాణ టీడీపీలోకి ఆహ్వానిస్తున్నారు. చంద్రబాబు ప్లాన్ ని అంచనా వేయడంలో కేసీఆర్ విఫలం అయ్యాడని ఇప్పుడు అక్కడ రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. చంద్రబాబుని దెబ్బతీయడానికి కేసీఆర్ ప్రయత్నం చేస్తే కేసీఆర్ అంతు చూడటానికి చంద్రబాబు మాస్టర్ ప్లాన్ తో తెలంగాణపై ఫోకస్ పెట్టాడని రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట.
ఇది ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నాయకులకి అర్ధమైంది. చంద్రబాబుతో కచ్చితంగా నష్టం ఉంటుందని ఆ పార్టీ నేతలు ఇప్పటికే ఎదురుదాడి మొదలు పెట్టారు. ఇక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూడా చంద్రబాబుని కేసీఆర్ అనవసరంగా రెచ్చగొట్టారని అంటున్నారు. ఏపీలో కాలు పెట్టాలని ప్రయత్నం చేస్తే చంద్రబాబు తెలంగాణపై ఫోకస్ పెట్టారని, కచ్చితంగా తెలంగాణ టీడీపీ క్యాడర్ మళ్ళీ పుంజుకుంటూ అది కేసీఆర్ కి తీవ్ర నష్టం తీసుకొస్తుందని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి పేర్కొన్నారు. రానున్న ఎన్నికలలో టీడీపీతో కచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగులుతుందని అంటున్నారు.