సత్య, ఆదిత్యని తిరిగి అమెరికా పంపించాలని ప్రయత్నిస్తుంటుంది దేవుడమ్మ. మరోవైపు ఇంట్లోనుంచి వెళ్లిపోతుంది దేవి. అందరూ తనకోసం వెతుకుతుంటారు. దేవేమో రుక్కు ఫొటో తీసుకుని తండ్రి జాడ తెలుసుకునేందుకు నేరుగా దేవుడమ్మ ఇంటికే వెళ్తుంది. దాంతో బుల్లితెర ప్రేక్షకుల్లో మరింత ఉత్కంఠ నెలకొంటుంది. చివరగా రుక్మిణి, ఆదిత్యలకు దేవి ఓ చోట కనిపిస్తుంది. ఆ తర్వాత ఆగస్టు 12 ఎపిసోడ్లో ఏం జరిగిందో ఓ లుక్కేద్దాం..
దేవితో ఆదిత్య ఏంటమ్మా ఇలా వచ్చేశావ్.. అని అంటాడు. అపుడు దేవి ‘మరేం చేయాలి.. నాయన గురించి అడిగితే మాయమ్మ ఏం చెప్పదు.. మిమ్మల్ని తెలుసుకోమంటే మీరు చెప్పట్లేదు. అందుకే నేను తెలుసుకుందామని వచ్చిన. కానీ ఎవరు చెప్పట్లేదు. నేను మా నాయన్ని చూడాలి. చాలా మాట్లాడాలి..’ అంటూ దేవి ఎమోషనల్ అవుతుంది ఆదిత్య దగ్గర. ఆ మాటలు విని ఆదిత్య ప్రేమగా దేవిని గుండెలకు హత్తుకుంటాడు. నాకు నాలుగు రోజులు టైం ఇవ్వమ్మా.. మీ నాయన్ని నేను తీసుకొస్తా అంటాడు. నిజంగానే తీసుకొస్తారా అని దేవి అడగ్గా.. కచ్చితంగా తీసుకొస్తానని హామీ ఇస్తాడు. కానీ ఇంకోసారి ఇలా చెప్పకుండా వచ్చి మీ అమ్మను బాధపెట్టకూడదు.. అంటాడు దేవితో. తర్వాత అందరూ కలిసి అక్కడి నుంచి రామ్మూర్తి ఇంటికి వెళ్తారు.
అక్కడ దేవి కోసం రామ్మూర్తి కుటుంబం అంతా బాధపడుతుంటారు. ఇంకోసారి వెళ్లి రాధని వెతకండని, దేవి లేకపోతే రాధ బతకలేదని జానకి మాధవ్తో చెప్తుండగా.. రాధ దేవిని తీసుకుని వస్తుంది. అది చూసి అందరూ సంబరపడిపోతారు. తన మనసులో ఏదో బాధ ఉందని, తనని ఏం అడక్కండని.. దేవి మనసులో ఉన్న బాధ తనకు చెప్పిందని జానకితో అంటూ మాధవ్ని కోపంగా చూస్తాడు ఆదిత్య. దేవిని వెతికి తీసుకొచ్చినందుకు రామ్మూర్తి ఆదిత్యకు థ్యాంక్స్ చెప్తాడు. అపుడు ఆదిత్య ‘దేవి నా బిడ్డ’ అంటాడు ఒక్కసారిగా. అది విని అందరూ నిర్ఘాంతపోతారు. తర్వాత కవర్ చేస్తూ నా బిడ్డలాంటిదే అంటాడు. జానకి ఆదిత్యను పొగడుతుంది. తన మనసులో ఏముందో కనుక్కోమని మాధవ్కు చెప్తాడు రామ్మూర్తి.
అపుడు మాధవ్ నటిస్తూ.. ‘ఎక్కడికెళ్లావ్ తల్లి. నువ్ కనపడకపోతే మీ నాన్న ఎంత అల్లాడిపోయాడో తెలుసా’ అంటాడు దేవితో. ‘తన సమస్యేంటో నాకు చెప్పింది. తనని ఇపుడు ఎవరూ ఏం అడగకూడదని’ చెప్పాను కద రాధ అంటూ మాధవ్ని చూస్తూ కళ్లెర్రజేస్తాడు ఆదిత్య. ఇపుడు కథ ఇంకా రసవత్తరంగా మారుతుంది. అందరూ వెళ్లిపోగా ఆదిత్య, మాధవ్ ఇద్దరే అక్కడ ఉంటారు. ‘ఏంటి నా ఇంటికొచ్చి నీ ఇంటి మనిషిలా పెత్తనం చేస్తున్నావ్ అని మాధవ్ కోపంగా అడగ్గా.. ఏ ఇంట్లో ఉన్నా తను నా మనిషే. అది తెలిసి కూడా నువ్ ఇలా అడగడం తప్పు. అయినా నువేంటి నా కూతురు దగ్గర తెగ నటిస్తున్నావ్. పసిమనసులో విషం నింపి తను ఇల్లు వదిలి వెళ్లిపోయేలా చేశావ్. తను కనిపించింది కాబట్టి బతికిపోయావ్. దేవికేమైనా అయుంటే నువ్ ప్రాణాలతో ఉండేవాడివి కాదు. ఇంకోసారి ఇలా జరిగితే నిన్ను క్షమించను. నీ కూతురు కోసం నా కూతురును బాధపెడుతున్నావ్. అది నీకే మంచిది కాదు’ అని ఓ గట్టిగానే హెచ్చరిస్తాడు ఆదిత్య.
కానీ మాధవ్ ఏ మాత్రం జంకకుండా ‘ఆఫీసర్ నీ కూతురు, నీ భార్య అని నీకు నాకు మాత్రమే తెలుసు. కానీ వాళ్లు నా ఇంట్లోనే ఉన్నారు. అయినా నా ఇంటికొచ్చి నాకే దంకి ఇస్తున్నావంటే నీ ధైర్యమేంటో నాకు తెలియట్లేదు’ అంటూ సవాలు విసురుతాడు. నీ ఇంట్లోనే ఉన్నారు కదా అని.. ఏం చేసిన చెల్లుబాటు అవుతుందనుకుంటే అది నీ ప్రాణాలకే ప్రమాదం.. మైండ్ ఇట్ అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు ఆదిత్య. ‘దేవి, రాధలను తీసుకువెళ్తానని నువ్వనుకుంటున్నావ్.. వాళ్లు ఇంటి నుంచి వెళ్లిన మరుక్షణం ఏం జరుగుతుందో కూడా నువ్ ఊహించలేవు’ అని ఆదిత్యని ఉద్దేశించి నిప్పులు చెరుగుతాడు మాధవ్.
సీన్ కట్ చేస్తే.. దేవి అన్న మాటలను గుర్తుచేసుకుంటూ ఏకాంతంగా ఆలోచిస్తాడు ఆదిత్య. తన పరిస్థితిని తలచుకుంటూ బాధపడతాడు. నేనే మీ నాన్నని.. అని చెప్పుకోలేని పరిస్థితిని క్రియేట్ చేశాడు. తన మనసులో నా మీదున్న కోపాన్ని ఎలా తీసేయాలని తెగ ఆలోచిస్తుంటాడు. మరోవైపు దేవి.. ఆఫీసర్ ఇచ్చిన మాటను మననం చేసుకుంటుంది. రాధ అన్నం తీసుకొచ్చి దేవిని తినమంటుంది. నాన్న గురించి తెలిసిన తర్వాతే నేను అన్నం తింటానని శపథం చేస్తుంది దేవి. రాధ ఎంత బతిమిలాడిన తినకుండా పళ్లెం విసిరికొడుతుంది. అంతలోనే అక్కడకు వస్తుంది భాగ్యమ్మ. ఇలా అన్నం నేలపాలు చేయకూడదు బిడ్డా.. అని భాగ్యమ్మ అనగా ‘మాయమ్మ నేనడిగింది చెప్పలేదు. అందుకే నేను తినను’ అంటుంది దేవి కోపంగా.
అమ్మని బాధపెట్టకూడదు. నువ్ కనపడకపోతే పిచ్చిదానిలా ఊరంతా తిరిగింది. నువ్ అంటే మీ అమ్మకు ప్రాణం.. అని రాధ గురించి మంచిగా చెప్తుంది భాగ్యమ్మ. ‘నేకేం తెలియదు అవ్వ. నువేం మాట్లాడకు. నాకు మా నాయన కావాలి. అప్పటిదాకా నేను ఎవరు చెప్పినా వినను’ అంటూ భాగ్యమ్మ మీదకు అరుస్తుంది దేవి. చిన్నపిల్లవి నువ్ ఇలా మాట్లాడకూడదని భాగ్యమ్మ ఎంత చెప్పినా పంతం విడవదు దేవి. రాధ దుఖి:స్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత సీన్లో ‘నా మంచితనాన్ని ఆ మాధవ్ చేతకాని తనంగా తీసుకుంటున్నాడు. నాకున్న అధికారంతో వాడిని అడ్రస్ లేకుండా చేయలేనా? నా బిడ్డ, భార్య బాధపడుతున్నా.. అమ్మానాన్న నేర్పించిన సంస్కారం అడ్డువచ్చి వాడిని ఏం చేయలేకపోతున్నా’ అంటూ మాధవ్ని అసహ్యించుకుంటాడు ఆదిత్య. దేవికిచ్చిన మాటను ఆదిత్య నిలబెట్టుకుంటాడా? అసలేం జరగనుంది? తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..