దేవి, రుక్మిణిని ఓ ఆశ్రమానికి తీసుకెళ్తాడు ఆదిత్య. పిల్లలందర్నీ చూసి తన తండ్రి గురించి అడిగి అమ్మని సతాయించనని మాటిస్తుంది దేవి. అక్కడ కాసేపు గడిపిన తర్వాత తిరిగి ఇంటికెళ్తారు. దేవి చెప్పిన మాటలు విని షాకవుతాడు మాధవ్. ఆ తర్వాత ఆగస్టు 16 ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం..
ఆశ్రమం నుంచి వచ్చిన దేవిని ఎక్కడికెళ్లావ్ తల్లీ అని అడుగుతాడు మాధవ్. ‘ఆఫీసర్ సార్ నన్ను, అమ్మని ఓ చోటుకు తీసుకెళ్లాడు. మా నాయన కనపడట్లేదని నేను పరేషాన్ అవుతున్నా కదా. అందుకే అక్కడికి తీసుకెళ్లాడు. అక్కడ నాలాంటి పిల్లలు చాలా మంది ఉన్నారు. అమ్మా, నాన్న లేకున్నా వాళ్లు చాలా సంతోషంగా ఉన్నారు. నాలాగా ఎవరూ బాధపడట్లేదంటూ’ దేవి పూసగుచ్చినట్టు చెప్తుంది. ఎందుకు అక్కడికి తీసుకెళ్లావ్ అంటూ రాధపై అరుస్తాడు మాధవ్. అపుడు దేవి ‘నేనేం బాధపడట్లేదు. వాళ్లను చూశాక మా నాయన నా దగ్గరికి రాకుంటే ఏంటి. మా అమ్మ ఉంది కదా చాలు. అందుకే మా నాన్న గురించి అడిగి మా అమ్మని బాధపెట్టను’ అంటుంది మాధవ్తో. ఆఫీసర్ సార్ ఉండగా నీకేం దిగులు లేదు బిడ్డా.. అని దేవిని తీసుకెళ్తుంది రాధ.
‘నాన్నా.. నాన్నా అని నువ్ ఇబ్బంది పెడితేనే కద తల్లి నాకు లాభం. మీ నాన్న గురించి రాధను గుచ్చి గుచ్చి అడిగితూనే ఉండాలి. సమాధానం చెప్పలేక రాధ అల్లాడిపోవాలి. అలా అయితేనే రాధ నాతో పెళ్లికి ఒప్పుకుంటుందని నేను ప్లాన్ చేస్తే సింపుల్గా మా నాన్న వద్దు అంటావా?.. వెంటనే ఇంకో ప్లాన్ మొదలుపెట్టాలి’ అని దేవిని ఉద్దేశించి మనసులో అనుకుంటాడు మాధవ్. మరోవైపు ఆదిత్య.. ‘దేవి మనసు మార్చడానికి ఆ మాధవ్ మళ్లీ వేరే ప్లాన్ చేస్తాడు.. అసలు అక్కడి నుంచి వాళ్లను ఎలా బయటకు తీసుకురావాలి’ అని ఆలోచిస్తాడు. అంతలోనే సత్య అక్కడికి వచ్చి ఏం ఆలోచిస్తున్నావని అడుగుతుంది ఆదిత్యని. ‘నువ్ ఎవరి గురించి ఆలోచిస్తున్నావని నేను అడగను కానీ.. నీలో నువ్ ఇలా బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నా. నువ్ ఇలా బాధపడడం నీ ఆరోగ్యానికి మంచిది కాదు’ అంటుంది. అదేం లేదు సత్య.. వరదల గురించి ఆలోచిస్తున్నానంటూ మాట మారుస్తాడు ఆదిత్య.
సీన్ కట్ చేస్తే.. ‘నా పెనిమిటి బిడ్డకు అర్థమయ్యేలా చెప్పిండు. లేకపోతే ఎంత పరేషాన్ అయింది. బిడ్డ మనసు అట్ల కరాబ్ చేసిండు’ అంటూ భాగ్యమ్మకు చెప్తూ ఎమోషనల్ అవుతుంది రాధ. ఆ గలీజు మాటలు విని బిడ్డ అలా తిట్టుంది కానీ.. ఆ ఆఫీసర్ సారే వాళ్ల నాయనని తెలిస్తే బిడ్డ ఎంత ఖుషీ అవుతదో అంటుంది భాగ్యమ్మ. రాధ, భాగ్యమ్మ మాట్లాడుకుంటుండగా.. బెడ్ మీద పడుకున్న దేవి అమ్మా.. అంటూ నిద్ర లేస్తుంది. దాంతో గుండె ఆగిపోయినంత పనవుతుంది రాధకు. వాళ్ల మాటలు ఏడిన్నదోనని నా పానం పోయింది అంటుంది భాగ్యమ్మతో.
వింటే బాగుండేంది.. ఈ రోజే ఆ మాధవ్ సంగంతేంటో తెలిసేది.. అని కోపంతో రగిలిపోతుంది భాగ్యమ్మ.
మరునాడు ఉదయం మాధవ్ రాధ దగ్గరకు వెళ్లి రెచ్చగొడతాడు. దేవి మనసు క్లీన్ చేశానని సంబరపడుతున్నారా.. మళ్లీ మళ్లీ చెత్త వేస్తూనే ఉంటా అంటూ పొగరుగా చెప్తాడు మాధవ్. నా బిడ్డ జోలికి వస్తే మంచిగుండదని హెచ్చరిస్తుంది రాధ. ‘ఇదిగో ఇలాగే నువ్, ఆదిత్య ఆవేశపడ్డారు. కానీ ఏమైంది. నా గురించి తెలిసి కూడా ఆవేశపడొద్దు రాధ. ఇపుడు నేనేం చేయబోతున్నానో జస్ట్ అలా చూడు’ అంటూ మళ్లీ బ్లాక్మెయిల్ చేస్తాడు మాధవ్.
తర్వాత సీన్లో కమలని ఆరోగ్యం ఎలా ఉంది. మందులు వాడుతున్నావా? అంటూ పలకరిస్తాడు ఆదిత్య. అక్కడే ఉన్న బాషాతో కమలని జాగ్రత్తగా చూసుకోమని చెప్తాడు. సత్య కూడా బాషాపై ప్రశంసల వర్షం కురిపిస్తుంది. అందరూ కలిసి సరదాగా కాసేపు మాట్లాడుకుంటారు. ఈ రోజు ఎలాగైనా ఆఫీసు దగ్గర నేనే దింపుతా పటేలా అంటాడు బాషా. కమల కూడా తీసుకెళ్లు పటేలా అంటుంది. తర్వాత్ సీన్లో మాధవ్ ఫోన్లో మాట్లాడుతూ నలుగురు అనాధలని పంపిచమంటాడు. వెంటనే అక్కడ ముగ్గురు వ్యక్తులు ప్రత్యక్షమవుతారు. నమస్కారం.. సర్పంచ్ గారితో మాట్లాడదామని వచ్చాం అంటారు వాళ్లు మాధవ్తో. నాన్న గుడికి వెళ్లారు. మీ సమస్యేంటో నాతో చెప్పండని అంటాడు. అపుడు ఆ రైతులు కోతకు వచ్చిన పంటలు వరదల్లో కొట్టుకుపోయాయ్యా. ప్రభుత్వం నుంచి వచ్చిన సాయం సగం మందికే అందింది. ఆఫీసర్ సార్ దగ్గరికి పోయి ఈ కాగితాలు ఇద్దామని వచ్చామయ్యా అంటారు వాళ్లు వినయంగా. ఆఫీసర్తో నేను మాట్లాడతా. ఆ కాగితాలు ఇచ్చి వెళ్లండని అంటాడు మాధవ్. కష్టాల్లో ఉన్నామని, త్వరగా పనయ్యేలా చేయండని మాధవ్ని వేడుకుంటారు రైతులు. దేవిని రెచ్చగొట్టడానికి మాధవ్ మళ్లీ ఏం కుట్ర చేశాడో తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..