Diwali: దీపావళి పండుగను మన దేశంలోనే కాకుండా విదేశీ గడ్డ మీద కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. తాజాగా న్యూయార్క్ సిటీలో దీపావళి వేడక వేళ అక్కడి స్కూళ్లకు ఒకరోజు సెలవు కూడా ప్రకటించారు. ఇస్లామిక్ దేశమైన దుబాయ్ లో కూడా ఎంతో ఘనంగా దీపావళిని జరుపుకుంటూ ఉంటారు. దేశం మొత్తం దీపాల వెలుగులో దీపావళిని ఎంతో ఘనంగా నిర్వహించుకుంటూ ఉంటే.. ఓ గ్రామం మాత్రం దీపావళిని జరుపుకోదు.
ఆ గ్రామంలో దీపావళిని జరుపుకోరు, దీపావళి రోజు ఇంటి ముందు దీపాలు పెట్టడం, టపాసులు కాల్చడం లాంటివి చేయరు. ఇది గత 200 సంవత్సరాలుగా కొనసాగుతున్న సంప్రదాయం. అవును మీరు చదువుతున్నది నిజమే. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పున్ననపాలెంలో 200 సంవత్సరాలుగా దీపావళి పండుగను జరుపుకోవడం లేదు.
200 ఏళ్ల క్రితం పున్ననపాలెం గ్రామంలో దీపావళి, నాగుల చవితి రోజు ఊయలలోని ఓ చిన్నారిని పాము కాటు వేయడం వల్ల చనిపోయాడట. మరో రెండు ఎద్దులు కూడా మరణించాయట. దీంతో ఆ రోజు నుండి దీపావళిని, నాగుల చవితిని జరుపుకోకూడదని గ్రామపెద్దలు నిర్ణించారట. దీంతో అదే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది.
Diwali:
పూర్వీకులు తీసుకున్న నిర్ణయానికి తాము కట్టుబడే ఉంటామంటూ సదరు గ్రామస్తులు ఇప్పటికీ దీపావళిని జరుపుకోరు. అయితే అదే గ్రామానికి చెందిన యువత మాత్రం ఆ భయాలను వదిలి దీపావళిని చేసుకుందామని చెప్పినా కానీ పెద్దలు మాత్రం దానికి ఒప్పుకోలేదట. దీంతో దీపావళికి దేశ, విదేశాల్లో సంబరాలు జరిగితే.. పున్ననపాలెం గ్రామం మాత్రం అమావాస్య చీకటి ఉంటుంది.