Chandrababu: జూనియర్ ఎన్టీఆర్ ప్రమేయం లేకుండానే ఇప్పుడు ఏపీ రాజకీయాలలో స్పెషల్ అట్రాక్షన్ గా మారిపోయారు. రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలు చేసుకుంటున్నా కూడా ఏదో ఒక విధంగా అభిమానులు గాని వైసీపీ నాయకులు గాని జూనియర్ ఎన్టీఆర్ ను ఇందులోకి లాగే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడును ఇరుకున పెట్టడానికి వైసీపీ అయితే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన పదేపదే ఉపయోగిస్తుంది. ఓ విధంగా ఇది చంద్రబాబు నాయుడు కూడా తీవ్రంగా అసహనానికి గురిచేస్తుంది.
ఇదిలా ఉంటే తాజాగా మచిలీపట్నం పర్యటనలో చంద్రబాబు నాయుడుకి మరోసారి జూనియర్ ఎన్టీఆర్ సెగ సొంత పార్టీ కార్యకర్తల నుంచి తగిలింది. ఎన్టీఆర్, హరికృష్ణ ఫోటోలు పట్టుకొని అభిమానులు హడావిడి చేశారు. జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ నినాదాలు కూడా చేశారు. అయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వారిని సైలెంట్ చేసే ప్రయత్నం చేశారు. ఇక ఎన్టీఆర్ ఫోటోలు పట్టుకోవడం వల్ల కొద్దిసేపు చంద్రబాబు పర్యటనలో గందరగోళం ఏర్పడింది. గతంలో కుప్పం నియోజకవర్గంలో కూడా చంద్రబాబు నాయుడుకి జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సెగ తగిలింది.
చంద్రబాబు నాయుడు కావాలనే జూనియర్ ఎన్టీఆర్ ని దూరం పెడుతున్నారని అభిప్రాయం వారిలో ఉంది. దీనిని రెచ్చగొట్టే ప్రయత్నం వైఎస్ఆర్సిపి చేస్తూ ఉందని మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం రాజకీయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. భవిష్యత్తులో ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్ చేపట్టే అవకాశం ఉందేమో కాని ప్రస్తుతానికి లేదనే చెప్పాలి. అయితే వైసీపీ మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ని పదే పదే ఉపయోగించి నారా లోకేష్ ని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తోంది.