హీరో నిఖిల్ కెరియర్ చూసుకుంటే స్వామి రారాకి ముందు ఆ తరువాత అని కచ్చితంగా డిసైడ్ చేయొచ్చు. అంతకు ముందు వరకు కమర్షియల్ ఫార్ములా మోజులో తన వయస్సుకి మించిన పాత్రలతో సినిమాలు చేసాడు. ఆ సమయంలో రవితేజ, పవన్ కళ్యాణ్ ప్రభావం తనపై ఉండటంతో ఎక్కువగా అలాంటి అల్లరి చిల్లరి కథలతో సినిమాలు చేసి ఫ్లాప్స్ కొట్టాడు. ఇక స్వామి రారా సినిమా హిట్ తర్వాత వెంటనే కార్తికేయతో సూపర్ సైన్స్ థ్రిల్లర్ కథని నమ్ముకొని సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో హిట్ కొట్టి తన కెరియర్ కి మంచి ఊపు తెచ్చుకున్నాడు. కార్తికేయ సినిమా అతని కెరియర్ ని కథల ఎంపిక విధానాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ తరువాత సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఉండే థ్రిల్లర్ కథలతోనే ఎక్కువ సినిమాలు చేశాడు.
ఇక తాజాగా తన ఫెవరెట్ మూవీ కార్తికేయకి సీక్వెల్ కార్తికేయ 2 తో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ సినిమాకి నిఖిల్ కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ పెట్టిన కూడా మొదటి నుంచి దర్శకుడు చందూ మొండేటి, అలాగే కథ మీద నమ్మకంతో హీరో ఉన్నాడు. ప్రమోషన్స్ లో కూడా అతని నమ్మకం చాలా స్పష్టంగా కనిపించింది. ఈ సారి కూడా డివోషన్ కి సైన్స్ మధ్య లింక్ పెట్టి కథని దర్శకుడు చందూ చెప్పే ప్రయత్నం చేశాడు. అతని ప్రయత్నం ఫలించినట్లే ఉంది. మొదటి రోజే సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో చిత్ర యూనిట్ మొత్తం చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇక హీరో నిఖిల్ కూడా తన నమ్మకం నిజమైనందుకు మీడియాతో తన సంతోషాన్ని పంచుకున్నారు.
ప్రేక్షకుల నుంచి ఊహించిన దానికంటే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చినందుకు థాంక్స్ చెప్పారు. ఇక కార్తికేయ 2 తో మరో సూపర్ సక్సెస్ ని నిఖిల్ తన ఖాతాలో వేసుకోవడంతో హీరోగా మరో మెట్టు ఎక్కినట్లే పాన్ ఇండియా రేంజ్ లోనే ఈ సినిమా రిలీజ్ కావడంతో కచ్చితంగా తన మార్కెట్ వేల్యూ కూడా ఈ సినిమా తర్వాత పెరుగుతుందని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉండబోతుందని దర్శకుడు చందూ చివర్లో క్లారిటీ ఇచ్చాడు. అయితే ఈ సారి బడ్జెట్ పరిధి 50 కోట్లు దాటిపోయే అవకాశం ఉంటుందనే మాట ఇప్పుడు వినిపిస్తుంది. కార్తికేయ తర్వాత సరైన సక్సెస్ చూడని చందూ మొండేటిని కూడా ఈ సినిమా స్టార్ దర్శకుల కేటగిరీలో చేర్చేయడం పక్కా అని విశ్లేషకులు అంటున్నారు.