నిఖిల్ సిద్ధార్థ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కార్తికేయ 2. పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకొని సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. అయితే 50 స్క్రీన్స్ పై రిలీజ్ అయిన ఈ సినిమా ప్రస్తుతం 800 కి పైగా స్క్రీన్స్ లో ప్రదర్శితమవుతుంది. బాలీవుడ్ లో అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోల చిత్రాలని బ్రేక్ చేస్తూ అక్కడి ప్రేక్షకులకు కార్తికేయ 2 సినిమా రీచ్ అయింది. హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ఇప్పటికి ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే కార్తికేయ 2 సినిమా విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకొని అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ ఉంది. ఇదిలా ఉంటే ఇప్పుడు కార్తికేయ 2 చిత్రానికి అరుదైన ప్రశంసలు లభించాయి.
ఇండియాలో ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ ఇస్కాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కృష్ణతత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తూ హిందూయిజం వ్యాప్తిలో కీలక భూమిక పోషిస్తుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు ఎక్కువగా నిర్వహిస్తూ దైవ చింతన లోనే అక్కడి ప్రభువులు ఉంటారు. అయితే అలాంటి ఇస్కాన్ సంస్థ నుంచి కార్తికేయ 2 కి ప్రశంసలు లభించాయి. దీనికి కారణం ఈ సినిమాలో కృష్ణతత్వాన్ని ప్రజలకు చేరే విధంగా దర్శకుడు చందు మొండేటి కథని చెప్పడమే. సముద్ర గర్భంలో కలిసిపోయిన ద్వారకా నగరం ఉనికి గురించి, అలాగే శ్రీకృష్ణుడి సందేశం గురించి అర్థమయ్యే విధంగా కార్తికేయ 2 సినిమాలో చెప్పారు.
ఈ నేపథ్యంలో ఈ సినిమా నార్త్ ఇండియన్ ప్రేక్షకులకు కూడా బాగా నచ్చింది. కార్తికేయ 2 లాంటి అద్భుతమైన చిత్రాన్ని ప్రేక్షకులకు అందించిన చిత్ర బృందానికి అభినందనలు తెలియజేస్తున్నట్లు ఇస్కాన్ కాల్గరీ ఒక లేఖ విడుదల చేశారు. ఇలాంటి కృష్ణతత్వాన్ని పెంపొందించే మరిన్ని సినిమాలు భవిష్యత్తులో రూపొందించాలని ఆకాంక్షించారు. దివ్య క్షేత్రమైన బృందావనంలో ఈ సినిమా టీజర్ ని విడుదల చేసేందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో శ్రీకృష్ణుడు తమకు మార్గ నిర్దేశనం చేయాలని ఆకాంక్షిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఇస్కాన్ లాంటి ఒక ఆధ్యాత్మిక సంస్థ నుంచి ఇలాంటి ప్రత్యేక అభినందనలు అందుకోవడం చాలా అరుదైన విషయం. అలాంటిది కార్తికేయ 2 చిత్రానికి ఇస్కాన్ సంస్థ నుంచి లభించడం గొప్ప విషయం అని చెప్పాలి.