Jagan : ఏపీ సీఎం ఇటీవలి కాలంలో గట్టిగా చెబుతున్న మాట.. ‘గ్రాఫ్ పెంచుకోవాల్సిందే’. గ్రాఫ్ పెంచుకోని వారికి టికెట్ ఇవ్వడం జరగదని మరోమారు తేల్చి చెప్పారు. ఇక ప్రతి నియోజకవర్గంలోనూ సర్వే చేయించి.. ఫలితం అనుకూలంగా వచ్చిన వారికే టికెట్ ఇవ్వడం జరుగుతుందని జగన్ వెల్లడించారు. ఇప్పటికే ఏపీ జగన్ గ్రాఫ్ పడిపోతూ వస్తోంది. రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయంటూ అక్కడి ప్రజానీకం మొత్తుకుంటోంది. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం నిరసనలకు, ఆందోళనలకు అడ్డాగా మారుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా తమ నియోజకవర్గంలో పర్యటిస్తున్న నేతలకు ప్రజల నుంచి ఊహించని రీతిలో వ్యతిరేకత వస్తోంది.
Jagan : ఆరు నెలల్లో అభ్యర్థుల ఎంపిక..
ఈ క్రమంలోనే సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక పార్టీని నిలబెట్టుకోవాలంటే.. ప్రజాప్రతినిధులు గ్రాఫ్ పెంచుకుంటేనే సాధ్యమవుతుందనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జగన్ తాజాగా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలతో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంపై మరోసారి వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులకు పలు సూచనలు చేశారు. ఎన్నికలకు కేవలం 20 నెలలు మాత్రమే సమయముందని… 14 నెలల్లోనే ఎన్నికల వాతావరణం వచ్చేస్తుందన్నారు. ఇక అభ్యర్థుల ఎంపిక ఆరు నెలల్లో జరుగుతుందన్నారు. ప్రజాభిప్రాయం మేరకు గెలిచేవారికే టికెట్అని తేల్చి చెప్పారు.
ప్రజల్లోకి వెళ్లి వారి మనసును మార్చాలని ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేశారు. ‘గడప గడపకూ’ కార్యక్రమం అమలవుతున్న తీరుపై జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కేవలం పార్టీ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం 15 మంది ఎమ్మెల్యేలు మాత్రమే పాల్గొంటున్నారని పేర్కొన్నారు. 50 మంది ఎమ్మెల్యేలు అసలే ‘గడప’ దాటడంలేదని వారి పేర్లను చదివి మరీ వినిపించారు. మిగతావాళ్లకు తిరగకుంటే బాగోదంటూ హెచ్చరికలు జారీ చేశారు. టికెట్ల విషయంలో ఇదే ప్రధానమైన అంశమని జగన్ స్పష్టం చేశారు. మొత్తానికి బద్దకించే ఎమ్మెల్యేలపై కొరడా ఝుళిపించారు.