Jagan : గత ఎన్నికల్లో వైసీపీ 150 సీట్లు టార్గెట్గా పెట్టుకుంటే.. ఎవరూ ఊహించని రీతిలో చివరకు ఆ పార్టీ అధిష్టానం సహా నేతలు కూడా ఊహించని రీతిలో 151 సీట్లు సాధించి అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇటీవలి కాలంలో ఆ పార్టీ గ్రాఫ్ మెల్లిమెల్లిగా పడిపోతూ వస్తోంది. ఉద్యోగుల్లో ఏమాత్రం పార్టీకి ఆదరణ లేదు. ఇక నిమ్నస్థాయి వర్గాలకు అంతో ఇంతో సంక్షేమ పథకాలు అందుతున్నాయి కాబట్టి పార్టీకి అక్కడ మాత్రం ఆదరణ బాగానే ఉంది. మధ్యతరగతి వర్గాల్లో పార్టీకి అంతగా ఆదరణ లేనట్టే తెలుస్తోంది. ముఖ్యంగా ఏపీ ప్రజానీకం బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కానీ వైసీపీ.. బీజేపీతో చట్టాపట్టాలేసుకుని తిరగడం అస్సలంటే అస్సలు ప్రజానీకం అంగీకరించలేకపోతోంది. కారణాలేవైనా మొత్తంగా చూస్తే సీఎం జగన్ను ఆ రాష్ట్ర ప్రజానీకం అట్టడుగు స్థానంలో నిలబెట్టారు. ఓ సర్వేలో తేలిన సత్యమిది.
Jagan : 20వ స్థానంలో జగన్..
దేశంలోని సీఎంలు ఏ స్థానంలో ఉన్నారనే దానిపై సెంటర్ ఫర్ నేషనల్ ఒపీనియన్ సర్వే(సీఎన్వోఎస్) అనే సంస్థ వివరాలు సేకరించింది. ఈ సర్వే ఫలితాలను సంస్థ తాజాగా విడుదల చేసింది. ప్రధాని మోదీతోపాటు దేశంలోని 25 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రజాదరణ ఏ మేరకు ఉందనే అంశంపై ఇటీవల సీఎన్వోఎస్ బృందాలు ఆయా రాష్ట్రాల్లో సర్వే నిర్వహించగా.. జగన్ 20వ స్థానంలో నిలిచారు. రాష్ట్రంలో 39 శాతం మంది జగన్ నాయకత్వంపై సంతృప్తి వ్యక్తం చేయగా.. 29 శాతం మంది అసంతృప్తితో ఉన్నారు. మిగిలిన 32 శాతం మంది తమ అభిప్రాయం వెల్లడించకుండా తటస్థంగా ఉండిపోయారు. జగన్ తర్వాత అట్టడుగున నిలిచిన సీఎంలలో మనోహర్లాల్ ఖట్టర్(హరియాణా), బసవరాజ్ బొమ్మయ్(కర్ణాటక), నీఫూ రియో(నాగాలాండ్), ప్రమాద్ సావంత్ (గోవా), మాణిక్ సాహా(త్రిపుర) ఉన్నారు.
ఇక తెలంగాణ విషయానికి వస్తే సీఎం కేసీఆర్ 11వ స్థానంలో నిలిచారు. ఆయన నాయకత్వంపై 49 శాతం మంది ప్రజలు సంతృప్తితో ఉండగా.. 19 శాతం మంది అసంతృప్తితో ఉన్నారు. 24 శాతం మంది తటస్థంగా ఉన్నారు. దేశంలో ప్రస్తుతం అత్యంత ప్రజాదరణ పొందిన సీఎంగా ఒడిసా సీఎం నవీన్ పట్నాయక్ నిలిచారు. ఆ రాష్ట్రంలో 70 శాతం ప్రజలు ఆయన నాయకత్వంపై పూర్తి సంతృప్తితో ఉండగా.. 19 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశంలో జనాదరణ పొందిన మొదటి ఐదుగురు ముఖ్యమంత్రుల్లో నవీన్ 51 పాయింట్ల నికర ఆమోదంతో ప్రథమ స్థానంలో నిలిచారు. తర్వాతి స్థానాల్లో వరుసగా యోగి ఆదిత్యనాథ్(ఉత్తరప్రదేశ్), ఉద్ధవ్ ఠాక్రే(మహారాష్ట్ర-ఇటీవలే రాజీనామా చేశారు), హిమంత బిశ్వ శర్మ(అసోం), భగవంత్సింగ్ మాన్(పంజాబ్) నిలిచారు.