జానకి కథలో కొత్త ట్విస్ట్ వచ్చింది. జానకిని జాయిన్ చేయించడానికి వెళ్లిన జ్ఞానాంబకి జెస్సీ అమ్మాయితో గొడవ అవుతుంది. అదే అమ్మాయి జానకి అక్క అంటూ వరుస కలుపుతుంది. ఇప్పుడు అదే అమ్మాయి జ్ఞానాంబ చిన్న కొడుకు అఖిల్తో ప్రేమలో ఉందనే విషయం నిన్నటి ఎపిసోడ్లో రివీల్ అయ్యింది. దాంతో కథ ఇంకా రసవత్తరంగా మారింది. ఆ తర్వాత రాఖీ సందర్భంగా అన్నయ్యలకి రాఖీ కడుతుంది వెన్నెల. అనంతరం మల్లిక సైతం తన తమ్ముడికి కూడా రాఖీ కడుతుంది. అది చూసి జానకికి తన అన్నయ్య గుర్తొచ్చి బాధపడుతుంది. అది చూసి జానకిని ఇంకా ఏడిపించాలని అనుకుంటుంది మల్లిక. ఆ తర్వాత ఆగస్టు 17లో ఏం జరిగిందో చూద్దాం..
‘ఏంటి జానకీ మీ అన్నయ్యకి రాఖీ కట్టడం కుదరలేదని బాధపడుతున్నావా. చేసుకున్న వాళ్లకి చేసుకున్నంత అంటారు కదా.. అత్తయ్య గారు మా తమ్ముడి ఫోన్ చేసి పిలిపించారు.. కానీ మీ అన్నయ్యకే ఫోన్ చేయలేదు.. అంటే మీ అన్నయ్యగారు చేసిన మోసం అత్తయ్యాగారు మనసులో అగ్నిపర్వతంలా మండుతుందన్న మాట.. నీకు ఈ సంవత్సరమే కాదు.. ఇంకా ఎప్పుడు మీ అన్నయ్యకి రాఖీ కట్టే అవకాశం లేదులే’ అని వెటకారంగా అంటుంది మల్లిక. దీంతో.. ‘నోర్ముయ్యవే.. నీ పుల్ల విరుపు మాటలు అర్ధం చేసుకోలేం అనుకుంటున్నావా.. ఇంకోసారి ఇలా చేస్తే మంచిగుండదు’ అని మల్లికకు గడ్డిపెడుతుంది జ్ఞానాంబ. జానకికి తన అన్నయ్య గుర్తుకు వచ్చి.. ఎమోషనల్ అవుతుంది. అది గమనించిన.. ‘అమ్మతో మాట్లాడమంటారా.. మీ అన్నయ్యకి రాఖీ కట్టించమంటారా’ అని అడుగుతాడు. దానికి.. ‘అన్నయ్యకి ఆమెకి బంధం తెగిపోయింది. చెల్లెలు అనే ప్రేమ మా అన్నయ్యలో చచ్చిపోయింది.. నాకోసం మా అన్నయ్య ఉన్నాడనే ప్రేమ కూడా చనిపోయింది’ అని బాధగా అంటుంది జానకి.
అయినప్పటికీ అమ్మతో చెప్పి ఒప్పిస్తాను మీరు మీ అన్నయ్యాకి రాఖీ కట్టమని అంటాడు రామా. దానికి.. ‘అత్తయ్యాగారికి క్షమించడం తప్ప మరేం తెలియదు. మా అన్నయ్య ఆమెని ఎంత బాధపెట్టాడో నాకు తెలుసు. ఆ బాధ ఆమె మనసులో ఉంటుంది. అత్తయ్యగారు ఒప్పుకున్నా నేను మాత్రం అన్నయ్యకి రాఖీ కట్టను. నా భర్తని అవమానించిన వాళ్లు నా రక్త సంబంధమైన నాకు అవసరం లేదు’ అంటుంది జానకి. ఇదంతా పక్కన నిల్చుని వింటూనే ఉంటుంది జ్ఞానాంబ.
కుటుంబ సభ్యులంతా రెడీ అయ్యి గుడికి వెళుతుంటారు. అదే సమయంలో జెస్సీ ఫోన్ చేయడంతో అఖిల్ స్టైల్గా రెడీ అయ్యి వెళుతుంటాడు. అది చూసిన జ్ఞానాంబ.. అంత హడావిడిగా ఎక్కడికి వెళుతున్నావురా అని అడగడంతో.. ఫ్రెండ్ బర్త్ డేకి అని అబద్ధం చెప్తాడు అఖిల్. ఏ ఫ్రెండ్.. బాయ్ ఫ్రెండ్నా.. గర్ల్ ఫ్రెండ్నా.. లేదంటే లవరా? అని మధ్యలో వేలు పెడుతుంది మల్లిక. ఆ మాటతో జ్ఞానాంబ.. అసలు నీకు బుద్ధి ఉందా? చదువుకునే పిల్లల దగ్గర అలాంటి మాటలు మాట్లాడతావా? నా కొడుకు అలాంటి పిచ్చి వేషాలు వేయడు.. నువ్ ఇంకోసారి ఇలా మాట్లాడావంటే బాగోదు’ అని మల్లికని తిట్టేస్తుంది జ్ఞానాంబ. కానీ.. జానకికి మల్లిక మాటల్లో నిజం ఉందనిపిస్తుంది. అందుకే ఇంతకుముందు అఖిల్ చదువుకున్నట్లు నటిస్తూ చాటింగ్ చేసిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటుంది జానకి. అనంతరం గుళ్లో పూజ అయిపోయిన తర్వాత ఫ్రెండ్ దగ్గరకి వెళ్లమని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతుంది. దాంతో జెస్సీకి జరిగిన విషయాన్ని చెబుతూ వాయిస్ మేస్సేజ్ పెడతాడు అఖిల్. ఆ సంగతి కూడా జానకి కంటపడుతుంది.
అప్పుడే ఆటోలో జర్నీలో ఉంటుంది జెస్సీ. అదే సమయంలో అఖిల్ మేస్సేజ్ విని అతనికి సర్ప్రైజ్ ఇవ్వడానికి గుడికి వెళుతుంది జెస్సీ. గుడికి వెళ్లిన జానకి కుటుంబ సభ్యులకి ఆమె అన్నయ్య యోగి ఎదురుపడతాడు. జానకికి హ్యాపీ రక్షాబంధన్ అని అంటాడు. అయితే జానకి మాత్రం అక్కడ నుంచి వెళ్లిపోబోతుంది. ‘ఈ అన్నయ్యని క్షమించరా జాను.. ఎలా ఉన్నావన్నయ్యా అని నా గుండెల్లో బాధని తొలగించరా’ అని యోగి ప్రాధేయపడతాడు. ‘నిన్ను ఏ అనుబంధంతో పలకరించాలి.. ఏరోజైతే నా భర్తని అందరి ముందు వంటవాడంటూ అవమానించావో.. ఆరోజే మన మధ్య ఉన్న అన్నాచెల్లెల్ల బంధం తెగిపోయింది.. మెట్టినింటి బంధం తప్ప నాకు రక్త సంబంధం లేదు’ అని కటువుగా అంటుంది జానకి. యోగి బాధపడినా, కుటుంబ సభ్యులు చెప్పిన అతన్ని క్షమించలేనని అంటుంది జానకి.
అప్పుడే జ్ఞానాంబ అందరికీ ఓ ట్విస్ట్ ఇస్తుంది. చికితాని పిలిచి సంచిలోని రాఖీ తీసిచ్చి జానకికి ఇచ్చి యోగికి రాఖీ కట్టమని అంటుంది జ్ఞానాంబ. అది చూసి ఎప్పుడూ పట్టుదలకి పర్యాయపదంలా ఉండే పోలేరమ్మ ఇలా మారిపోయిందేంటి అని షాక్ అవుతుంది మల్లిక. అత్తయ్యా కూడా రాఖీ కట్టమని చెప్పిన కుదరదని అంటుంది జానకి. ఆ మాటతో.. ‘నా కొడుకుని అవమానించాడనే బాధ నాలో ఉన్న మాట వాస్తవమే.. కానీ ఈ రాఖీ పండగ.. అన్నాచెల్లెల అనుబంధానికి తీపి గుర్తు.. అది చేదు జ్ఞాపకంగా మిగిలిపోకూడదు.. జీవితాంతం బాధపడకూడదు. నా వల్ల అలాంటి పరిస్థితి రాకూడదనే.. మీ అన్నయ్యని ఇక్కడికి పిలిపించాను.. వెళ్లి రాఖీ కట్టు’ అని అంటుంది జ్ఞానాంబ. జానకి రాఖీ కట్టిందా లేదా.. తను గొడవపడ్డ జ్ఞానాంబనే తన లవర్ అఖిల్ తల్లి అని తెలిస్తే జెస్సీ ఎలా రియాక్ట్ అవుతుందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.