Janasena: పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి గ్రౌండ్ లెవల్ లో బలమైన నాయకత్వం, క్యాడర్ లేకపోయిన ఆ పార్టీ ఇంకా తన వాయిస్ ని వినిపిస్తుంది అంటే సోషల్ మీడియాలో ఉన్న బలం అని చెప్పాలి. పేరు, ఊరు లేని, ధైర్యంగా రోడ్ల మీదకి వచ్చి ఫైట్ చేయలేని కుర్రాళ్ళు ఇలా సోషల్ మీడియాలో తన వాయిస్ ని వినిపిస్తూ ఉంటారనేది చాలా మంది చేసే విమర్శలు. అయితే జనసేన పార్టీ మాత్రం తన మనుగడని కొనసాగిస్తుంది అంటే దానికి సోషల్ మీడియానే కారణం అని చెప్పాలి. ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకుంటున్న వారు, పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ కూడా సోషల్ మీడియాలో జనసేనని ఫాలో అవుతూ ఉంటారనేది అందరికి తెలిసిందే. అయితే వీరందరూ కూడా జనసేన బలం అని అనుకోవడంలో ఉన్నంత మూర్ఖత్వం ఇంకోటి ఉండదు అనేది రాజకీయ విశ్లేషకుల మాట.
తాజాగా పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో జనసేన పార్టీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ 20 లక్షల ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్న సందర్భంగా ట్వీట్ చేశారు. జనసైనికులని ఈ సందర్భంగా అభినందించి, పార్టీకి వెన్ను దన్ను మీరే అని చెప్పారు. అలాగే మరో నాయకుడు స్పందిస్తూ జనసేన 20 లక్షల కుటుంబ సభ్యులు అంటూ సంబోధించారు. అయితే గత ఎన్నికలలో జనసేన పార్టీకి వచ్చిన ఓట్లు కూడా అన్ని లేవనే చెప్పాలి. కాని జనసేన సోషల్ మీడియా గ్రూప్స్ చూస్తే మాత్రం అన్ని కలిపి కనీసం కోటి మంది ఫాలోవర్స్ ఉంటారు.
అయితే ఇలా సోషల్ మీడియాలో పార్టీని ఫాలో అయ్యేవారంతా జనసేన కుటుంబ సభ్యులే అనే భ్రమలో ఆ పార్టీ నాయకులు ఉన్నట్లు ఉన్నారని వారి ట్వీట్ లు చూస్తూ ఉంటే అర్ధమవుతుంది అంటూ వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియా గ్రూపులు అన్న తర్వాత అన్ని పార్టీల వారకు ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది. గ్రూప్ లో ఉన్నవారిలో చాలా మంది డైలీ ఆ పార్టీ అప్డేట్స్ తెలుసుకోవడానికి మాత్రమే ఫాలో అవుతారు.. అలా ఫాలో అయ్యేవారందరూ ఓటర్లుగా మారరు. అలాగే వారిలో ఓటుహక్కు రాని వారు కూడా ఉంటారు. అలాంటి వారిని నమ్ముకొని జనసేన ఇప్పటికి కూడా సంస్థాగత నిర్మాణం లేకుండా రాజకీయాలు చేయడం హాస్యాస్పదంగా ఉందనే విమర్శలు రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.