అధికార పార్టీ వైసీపీని గద్దె దించే ఉద్దేశ్యంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వం వ్యతిరేక ఓట్లు చీలకుండా చేస్తానని అన్నారు. ఈ నేపధ్యంలో కచ్చితంగా పొత్తులతోనే ఎన్నికల బరిలోకి వెళ్తారని చెప్పకనే చెప్పారు. ఇది ఇప్పుడు వైసీపీని టెన్షన్ పెడుతుంది. ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే వైసీపీ అధికారానికి దూరమయ్యే అవకాశాలు ఉన్నాయనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. రాజకీయ విశ్లేషకులు కూడా అదే మాట చెబుతున్నారు. అయితే వీరిని ఎలా అయినా దూరం చేయాలని వైసీపీ వ్యూహాత్మకంగా జనసేనపై విమర్శల దాడి చేస్తుంది. అదే సమయంలో జనసైనికులని రెచ్చగొట్టే ప్రయత్నం మొదలు పెట్టింది. ఇదిలా ఉంటే జనసేన పార్టీ పొత్తుల ఎత్తులో భాగంగా ఇప్పటికే టీడీపీకి తమకి కావాల్సిన సీట్లు ఎన్ని అనేది చెప్పకనే చెప్పింది.
పవన్ కళ్యాణ్ 57 సీట్ల వరకు ఆశిస్తున్నారు. అయితే అన్ని స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ సిద్ధంగా లేదు జనసేన బలం అంతలేదు అనేది టీడీపీ ఆలోచన. ఇక జనసేన పొత్తు పెట్టుకున్నా కూడా కచ్చితంగా అధికార భాగస్వామ్యం కూడా ఇవ్వాలని జనసైనికులు ఆశిస్తున్నారు. బయటకి చెప్పకపోయిన పవన్ కళ్యాణ్ అభిప్రాయం కూడా ఇదే. అందుకే వ్యూహాన్ని తనకి వదిలేయాలని చెబుతున్నారు. అయితే అధికార భాగస్వామ్యం ఇవ్వడానికి టీడీపీ సిద్ధంగా లేదనే మాట వినిపిస్తుంది. ఇప్పటికే చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగుపెడతా అని శపథం చేశారు.
జనసేనానికి ముఖ్యమంత్రి పదవి ఇస్తే చాలెంజ్ తప్పినట్లు అవుతుంది. అలాగే టీడీపీ శ్రేణులు కూడా పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చూడాలని అనుకోవడం లేదు. అయితే ఈ విషయంలో జనసేన పార్టీ తగ్గే ఛాన్స్ లేనట్లు కనిపిస్తుంది. ఈ నేపధ్యంలో రెండు పార్టీల మధ్య ఒక్క సీఎం సీటే అడ్డంకిగా ఉందనే మాట ఇప్పుడు రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. ఎవరో ఒకరు సీఎం సీటుని త్యాగం చేస్తేనే తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య పొత్తు కుదురుతుందని అంటున్నారు.