AP Politics: ఏపీ రాజకీయాలలో అధికార పార్టీ వైసీపీని ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము లేక టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయాలని వైసీపీ నాయకులు పదే పదే చాలెంజ్ చేస్తున్న కూడా ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఎదురుదాడి చేస్తున్నాయి తప్ప తమ దమ్ము చూపించే విధంగా మాట్లాడటం లేదు అనేది రాజకీయ వర్గాలలో వినిపించే మాట. ఇదిలా ఉంటే ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరల షూటింగ్ లకి గ్యాప్ ఇచ్చి పార్ట్ టైమ్ పొలిటికల్ టూర్ పెట్టుకున్నారు. జనసేన ఆవిర్భావ సభ పేరుతో ఓ నాలుగు రోజులు షెడ్యూల్ పెట్టుకొని తన స్టైల్ లో అధికార పార్టీ మీద విమర్శలు చేయడానికి సమయం కేటాయింబోతున్నారు అనేది రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట.
అప్పుడప్పుడు రావడం, రెండు, మూడు రోజులు హడావిడి చేసి వెళ్లిపోయి షూటింగ్ లు చేసుకోవడం పవన్ కళ్యాణ్ అలవాటు. అయితే మరల రెండు నెలల గ్యాప్ తర్వాత ఇప్పుడు ప్రచార ఆర్భాటంతో వచ్చారు. ఇప్పటికే టీడీపీతో జనసేన అనాధికార పొత్తులో ఉందనేది అందరికి తెలిసిన నిజం. వారి మధ్య సీట్ల పంపకాల విషయంలో కూడా ఒప్పందం జరిగిపోయింది. అందులో భాగంగానే ఈ నాలుగు రోజులు ఆవిర్భావ సభ పేరుతో బయటకి వచ్చి హడావిడి చేసి పవన్ కళ్యాణ్ వెళ్ళిపోతాడు అనేది టాక్ వినిపిస్తుంది.
అలాగే ఈ నాలుగు రోజులు టీడీపీ అనుకూల మీడియా మొత్తం బడ్జెట్ సమావేశాలు కూడా పక్కన పెట్టి ఎమ్మెల్సీ ఎన్నికలని కూడా పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ చుట్టూ కెమెరాలు తిప్పడానికి సిద్ధం అయిపోయాయి. పవన్ కళ్యాణ్ ఎంతగా ప్రజలని ఆకర్షిస్తే తమ బలం అంత పెరుగుతుంది అనేది టీడీపీ ఆలోచన. అందుకే అతనికి ఎలా ఫోకస్ ఇవ్వాలో కూడా లెక్కలు వేసుకొని మరీ ఇస్తున్నారు. అయితే యుద్ధానికి నేను సిద్ధం అని పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి మంగళగిరి వస్తూ ట్వీట్ చేశారు. ఇక దీంతో జనసైనికుల హడావిడి మళ్ళీ మొదలెట్టండి అని పవన్ కళ్యాణ్ సూచించినట్లు ఉందనే మాట వినిపిస్తుంది.