TDP: ఏపీ రాజకీయాలలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది సమీకరణాలు మారుతున్నాయి. పాత నాయకులు అందరూ మరల యాక్టివ్ అవుతున్నారు. కాంగ్రెస్, బీజేపీలో ఉంటున్న ఒకప్పటి ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా తిరిగి రాజకీయ భవిష్యత్తు వెతుక్కుంటూ ప్రధాన పార్టీల వైపు దృష్టి సారిస్తున్నారు. ఏపీలో ఈ సారి త్రిముఖ పోరు ఉంటుందనే మాట వినిపిస్తుంది. ముఖ్యంగా వైసీపీ, టీడీపీ మధ్య ప్రధాన పోటీ ఉన్న ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ తీసుకునే రాజకీయ నిర్ణయాలు, వ్యూహాలతో పరిణామాలు మారిపోయే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ సైలెంట్ గా ఉన్నారు.
ఈ నేపధ్యంలో టీడీపీ, జనసేన పొత్తుతో ఎన్నికలకి వెళ్తుంది అని అందరూ భావిస్తున్నారు. అయితే పొత్తులపై పవన్ కళ్యాణ్ ఒక స్పష్టమైన వైఖరి అయితే ఇప్పటి వరకు చెప్పలేదు. ఈ నేపధ్యంలో టీడీపీ, వైసీపీల మధ్యనే నాయకుల జంపింగ్ లు జరుగుతున్నాయి. ముఖ్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ దగ్గరకి కూడా పాత నాయకులు చేరడానికి ప్రపోజల్ పెట్టిన కూడా అతను వద్దని చెప్పడంతోనే వారంతా సైలెంట్ అయిపోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక తాజాగా బీజేపీకి ఆ పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే కన్నా లక్ష్మినారాయణ జనసేనలో చేరుతారని ఊహాగానాలు వినిపించాయి.
అయితే కన్నా తమ మిత్రపక్షంలో ఉన్న వ్యక్తి కావడంతో తమ పార్టీలోకి చేర్చుకునే అవకాశం ఉండదని పవన్ కళ్యాణ్ చెప్పకనే చెప్పారు. ఇదిలా ఉంటే తాజాగా కన్నా లక్ష్మినారాయణ టీడీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారనే మాట వినిపిస్తుంది. ఈ నెల 23న చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ కండువా కప్పుకోనున్నారని తెలుస్తుంది. ఇక టీడీపీలో చేరిన తర్వాత గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ చార్జ్ బాధ్యతలని ఆయనకి అప్పగించనున్నట్లు తెలుస్తుంది. ఇక వచ్చే ఎన్నికలలో ఆ నియోజకవర్గం నుంచి లేదంటే సత్తేనపల్లి నియోజకవర్గంలో పోటీ చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది. సత్తెనపల్లిలో కాపు ఓటుబ్యాంకు కన్నా లక్ష్మినారాయణకి కలిసి వస్తుందని టీడీపీ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. పొత్తులో వెళ్తే సత్తెనపల్లి నియోజకవర్గం జనసేన కోరుకునే అవకాశం ఉందనే మాట ఇప్పుడు వినిపిస్తుంది. మరి భవిష్యత్తు రాజకీయాలు ఎలా ఉంటాయనేది వేచి చూడాలి.