‘డాక్టర్ బాబు’ అని అరుస్తూ కోమాలోంచి బయటికి వస్తుంది దీప. భర్తకోసం వెతుకుతూ ఆసుపత్రి మొత్తం తిరుగుతుంది దీప. అది చూసిన డాక్టర్కి జాలేస్తుంది. దాంతో మాట కలుపుతాడు. ఆయన్ని చూసి అన్నయ్య అని వరుస కలిపి భర్త గురించి సహాయం చేయమని అడుగుతుంది దీప. దాంతో మార్చురీకి తీసుకెళ్లి చెక్ చేస్తే అక్కడ కార్తీక్ శవం లేకపోవడంతో ఊపిరి పీల్చుకుంటారు. అనంతరం దీపని తన ఇంటికి తీసుకెళ్లి తన అమ్మకి పరిచయం చేస్తాడు డాక్టర్. ఆమె కూడా వంటలక్కని సొంత కూతురిగా ఆదరిస్తుంది. ఆ తరువాత ఆగస్టు 17 ఎపిసోడ్లో ఏం జరిగింతో చూద్దాం..
డాక్టర్.. దీపని తన ఇంటికి తీసుకుని వెళ్లి తన తల్లికి పరిచయం చేస్తాడు. ‘అమ్మా చెల్లిని ఇంటికి తీసుకొస్తున్నా అని చెప్పాను కదా.. ఇదిగో నీ కూతురు’ అంటాడు డాక్టర్ దీపని చూపిస్తూ. ఆమె చాలా ప్రేమగా దీప దగ్గరకు వెళ్లి.. ‘అమ్మా నువ్వేనా? నీ గురించి మాట్లాడుకోని రోజు లేదు. నువ్వు కోమాలో ఉన్నప్పుడు ప్రతి రోజు నీ గురించే చెప్పేవాడు వీడు.. నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు. దేవుడు నీకు కష్టాలు పెడుతున్నాడు. అయినా దేవుడ్ని నిందించకూడదు.. అంతా మంచే జరుగుతుందని నమ్మాలి’ అని దీపకి ధైర్యం చెబుతుంది ఆ పెద్దావిడ. అనంతరం వంటమనుషులు రాముడు, పండుని పిలిచి గెస్ట్ కోసం వంట చేయమంటుంది. మంచి రుచి గల భోజనం చేసి చాలా రోజులైంది. ఇప్పటికైనా మంచిగా వంట చేయండ్రా అని చెబుతుంది ఆ పెద్దావిడ. అది విని నేను వంట చేస్తానమ్మా అంటుంది దీప. దానికి నీకెందుకమ్మా శ్రమ అంటే.. నన్ను కూతురిలా ఆదరిస్తున్నారు. అలాంటి మీకోసం వంట చేయడం శ్రమ కాదంటూ వంటగదికి వెళుతుంది దీప.
ఆ తర్వాత సీన్లో.. చిన్నప్పటి సౌర్య అమ్మనాన్న గురించి ఆలోచిస్తూ బాధపడుతుంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన బాబాయ్, పిన్ని సౌర్యతో మాట్లాడటానికి వస్తారు. సౌర్యని నాన్నమ్మ, తాతయ్య దగ్గరకి వెళ్లమని బ్రతిమిలాడుతుంటారు. అయినా హిమ ఉన్న ఇంటికి వెళ్లనని బెట్టుచేస్తుంది సౌర్య. దాంతో.. ‘నువ్వు గొప్పింటి బిడ్డవి బంగారం. నీలాంటి వాళ్లు ఈ పేదింట్లో ఉండలేరు. మేము ఏదో చిన్న చిన్న దొంగతనాలు చేసిన బతుకుతున్నాం. మాకే పుట్టిన నాలుగు నెలలకి బిడ్డ చనిపోయినందుకు చాలా బాధపడుతున్నాం. అలాంటిది మీ నాన్నమ్మ, తాతయ్య ఎంత ఆవేదన పడుతుంటారో అర్థం చేసుకో’ అంటూ సౌర్యని కన్విన్స్ చేస్తారు గండ, చంద్రమ్మ. వారి మాటలు సౌర్య మనసుపై బాగా పని చేస్తాయి. దాంతో నాన్నమ్మ, తాతయ్య దగ్గరకి వెళ్లడానికి ఒప్పుకుంటుంది.
అనంతరం వంట చేసిన దీప ప్రేమగా అందరికీ వడిస్తూ ఉంటుంది. అది తిన్న పెద్దావిడ ఇలాంటి భోజనం తిని చాలా రోజులైంది. చాలా రుచిగా ఉందని పొగడ్తలు కురిపిస్తుంది. డాక్టర్ కూడా బావుందని పొగుతాడు. దాంతో దీప మొహమాటపడుతూ మీరు ఇంతకంటే బాగా వండగలుగుతారు కదా అంటుంది. నా కొడుకు వంట చేయనియట్లేదని చెబుతుంది పెద్దావిడ. దాంతో కార్తీక్ గతంలో అన్నమాటలు గుర్తు చేసుకుంటుంది. రాముడు, పండు సైతం ఇలాంటి వంట తిని చాలా రోజులైందక్కా అని ప్రేమగా వడ్డించుకొని తింటారు. అనంతరం మరుసటి రోజు పిల్లల కోసం హైదరాబాద్కి వెళుతున్నట్లు చెబుతుంది దీప.
అనంతరం కార్తీక్ దీప చనిపోయామని పిల్లలు చాలా బాధపడుతున్నట్లు ఊహించుకుంటూ రోడ్డుపై నడుస్తూ ఉంటుంది. త్వరగా పిల్లల దగ్గరకి వెళ్లాలని ఆలోచిస్తూ ఉంటుంది. అటుగా వచ్చిన హైదరాబాద్ వెళ్లే బస్సు ఎక్కుతుంది దీప. అనంతరం ఇష్టం లేని చోటుకి వెళ్లమంటున్నారు అంటూ గండని, చంద్రమ్మతో అంటుంది చిన్నప్పటి సౌర్య. నాన్నమ్మ, తాతయ్య దగ్గర వెళితే వాళ్ల మీద కోపంతోపాటు.. బాధగా కూడా తగ్గుతుందని సముదాయిస్తారు గండ, చంద్రమ్మ. ఆ తర్వాత అక్కడికి వచ్చిన హైదరాబాద్ వెళ్లే బస్సు ఎక్కుతారు. ఇక్కడ ట్విస్టు ఏంటంటే.. అదే బస్సుని ఇంతకుముందు దీప కూడా ఎక్కింది. అంటే సౌర్య, దీప ఒకే బస్సులో ప్రయాణిస్తూ ఉన్నారన్న మాట.
మరోవైపు ఇల్లు అమ్మేసి అమెరికా వెళ్లేందుకు సామాన్లు సర్దుకుంటూ ఉంటారు సౌందర్య, ఆనందరావు. హిమనేమో తల్లిదండ్రులను తలచుకుంటూ కన్నీటి పర్యంతమవుతుంటుంది. మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయారంటూ సౌందర్య తల్లడిల్లిపోతుంటుంది. ఈ భరించలేని బాధని తట్టుకొని జీవితాంతం ఎలా బ్రతకాలి అనుకుంటూ బాధపడుతుంటుంది సౌందర్య. దాంతో ఈ ఎపిసోడ్కి శుభంకార్డు పడుతుంది. తరువాయి భాగం అంటూ.. తన భర్తని బ్రతికుండేలా చూడమంటూ గుడిలో వేడుకుంటూ ఉంటుంది దీప. అప్పుడే దీప అని పిలుస్తూ వాయిస్ వినిపిస్తుంది. ఆ గొంతు డాక్టర్ బాబుది. భర్తని చూసిన దీప పరిగెత్తుకుంటూ వెళ్లి కార్తీక్ని గట్టిగా కౌగిలించుకుంటుంది. అది నిజమేనా లేక ఏదైనా ట్విస్ట్ వస్తుందా తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.