టిఆర్ఎస్ పార్టీని భారతీయ రాష్ట్రీయ సమితిగా మార్చి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖమ్మం వేదికగా బిఆర్ఎస్ ఆవిర్భావ సభని భారీ ఎత్తున నిర్వహించారు. ఈ సభకి ఏకంగా ముగ్గురు ముఖ్యమంత్రిలను కేసీఆర్ ఆహ్వానించారు. కేరళ ముఖ్యమంత్రి పెనరయి విజయన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ హాజరయ్యారు. అలాగే కేంద్రంలో కాంగ్రెస్, బిజెపికి ప్రత్యామ్నాయంగా పనిచేస్తున్న నాయకులను కూడా కేసీఆర్ ఇన్వైట్ చేశారు. ఇదిలా ఉంటే ఈ బహిరంగ సభలో కేసీఆర్ బిజెపిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో ఢిల్లీకి బిఆర్ఎస్ పార్టీ వెళ్లడం మోడీ ఇంటికి వెళ్లడం ఖాయమని పేర్కొన్నారు.
ప్రధాని మోడీ దేశంలో ప్రజలకు సంక్షేమ పాలన అందించాలని విషయాన్ని పక్కనపెట్టి మతాన్ని ఉపయోగించుకొని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఎన్నో నదుల నుంచి జలాలు వృధాగా సముద్రంలో కలుస్తున్న కూడా వాటిని ఒడిసిపట్టి ప్రజలకు వినియోగంలోకి తెచ్చే ప్రయత్నం చేయడం లేదని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ప్రైవేటైజేషన్ చేయడం దారుణమైన చర్య అని అన్నారు.
తెలుగు ప్రజల హక్కు అయిన విశాఖ ఉక్కుని మోడీ అమ్మేస్తానని చెప్తున్నారని, తాము అధికారంలోకి వస్తే విశాఖ ఉక్కును మళ్ళీ జాతీయం చేస్తామని తెలిపారు. అలాగే ఎల్ఐసిమో మళ్లీ ప్రభుత్వంలోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. అలాగే దేశం మొత్తం రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తామని తెలియజేశారు. దేశమంతా మిషన్ భగీరథతో మంచినీరును ప్రజలకు అందిస్తామని అన్నారు. ప్రతి సంవత్సరం 25 లక్షల మందికి దళిత బందును చేకూర్చేలా ప్రణాళికలో రూపొందిస్తామని తెలిపారు. అలాగే మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. తెలంగాణ మోడల్ ను దేశమంతా విస్తరింప చేయడమే బిఆర్ఎస్ లక్ష్యమని కెసిఆర్ ఉద్ఘాటించారు. బిఆర్ఎస్ పార్టీని చూసి మోడీ రోజులు లెక్క పెట్టుకోవాలని అన్నారు.