కొద్ది రోజుల క్రితం వరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీతో తెలుగు రాష్ట్రాలలో భాగా హడావిడి చేశారు. ఏపీలో కూడా బీఆర్ఎస్ పార్టీని విస్తరిస్తానని చెప్పడంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బలమైన నాయకులకి బీఆర్ఎస్ బాధ్యతలు అప్పగించాలని భావించారు. అందుకోసం తటస్థంగా ఉన్న చాలా మంది నాయకులతో సంప్రదింపులు కూడా జరిపారని బోగట్టా. ఏపీలో విజయవాడలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం అతి త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పుకొచ్చారు. ఏపీలో జరగబోయే ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ పోటీ చేస్తుందనే విధంగా ఊదరగొట్టారు. వైసీపీతో పొత్తు పెట్టుకుంటుంది అనే మాట కూడా వినిపించింది.
అయితే టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పుడైతే వ్యూహాత్మకంగా ఖమ్మంలో బహిరంగ సభ పెట్టి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయబోతుంది అని ప్రకటించారో ఒక్కసారిగా కేసీఆర్ ఆలోచనని మార్చుకున్నట్లు తెలుస్తుంది. ఏపీలో అడుగుపెట్టిన చంద్రబాబుని ఇప్పటికే తెలంగాణలో ఓటుకినోటు కేసులో ఇరికించేశాం కాబట్టి తమతో పోటీ పడే ధైర్యం చంద్రబాబు చేయరని కేసీఆర్ టీమ్ భావించింది. అయితే చంద్రబాబు మాత్రం చాలా వ్యూహాత్మకంగా ముందుగా టీడీపీ తెలంగాణ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ ని అనౌన్స్ చేసి తర్వాత బహిరంగ సభ నిర్వహించారు. ఈ నేపధ్యంలో తప్పనిసరి పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన కరుడుగట్టిన టీడీపీ నాయకులు అందరూ మళ్ళీ సొంతగూటికి వచ్చే దిశగా ఆలోచిస్తున్నారు.
అలాగే సైలెంట్ గా ఉన్న టీడీపీ క్యాడర్ కి కూడా ఉత్సాహం వచ్చింది. ఈ నేపధ్యంలో టీడీపీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిన నేతల నుంచి అసమ్మతి స్వరం వినిపిస్తుంది. వారంతా గత కొంత కాలంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మాట్లాడుతూ ఉండటం ఇప్పుడు కేసీఆర్ ని కలవరపెడుతుంది. అసలే బీజేపీ పార్టీ పక్కలో బల్లెం తరహాలో ఎప్పుడు అధికారం ఎత్తుకుపోదామా అనే విధంగా చూస్తుంది. ఇలాంటి సమయంలో రిస్క్ చేసి ఏపీలో కూడా ఆంటే టీడీపీ నుంచి తెలంగాణలో తమకి భారీగా గండిపడే ప్రమాదం ఉందని కేసీఆర్ అర్ధం చేసుకొని వ్యూహాత్మకం మౌనం వహించినట్లు రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట.