Kishan Rreddy: తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక అన్ని పార్టీల్లో తీవ్ర కాకను రేపగా.. అది టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ ప్రయత్నించడంతో పీక్స్ కు చేరింది. టీఆర్ఎస్ కు చెందిన పలువురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ తరఫున కొంతమంది హైదరాబాద్ కు ఆమడ దూరంలో ఉన్న మొయినాబాద్ ఫాం హౌజ్ లో మంతనాలు జరపడం సంచలనం రేపింది.
టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి వంద కోట్ల చొప్పున చెల్లించడానికి తాము సిద్దంగా ఉన్నామని బీజేపీ తరఫున మంతనాలకు వచ్చిన వారు ప్రకటించారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియోను తాజాగా తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీడియా సమావేశంలో ప్లే చేసి చూపిస్తూ.. బీజేపీ మీద దుమ్మెత్తిపోశారు.
కేసీఆర్ వ్యాఖ్యల మీద కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ‘నిన్నటి సినిమా చూస్తే కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉంది. రోహిత్ రెడ్డితో ప్రభుత్వం కూలిపోతుందంటే మేము చేసేదేమి లేదు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కేసీఆర్ కు విశ్వాసం లేదు. రోహిత్ రెడ్డి పెద్ద నీతిమంతుడా? నలుగురు ఎమ్మెల్యేలలో ముగ్గురు ఏ పార్టీ నుంచి వచ్చారు. పాత రికార్డునే తిరగరాశారు. మధ్యలో బ్రోకర్లను పెట్టి చేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు. ఎమ్మెల్యేలను చేర్చుకోడానికి ఆ మాత్రం శక్తి మాకు లేదా. స్వామీజీలు అవసరమా?’ అని కిషన్ రెడ్డి అన్నారు.
Kishan Rreddy:
అలాగే గతంలో బీజేపీలో చేరిన వారు ఎలా వచ్చారని.. బ్రోకర్లను మధ్యలో పెట్టి చేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదన్నా. నెలలో 15 రోజులు ఫామ్ హౌజ్ లో ఉండే కేసీఆర్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారని.. సామాన్య ప్రజలను ఆయన ఎపుడైనా కలిశారా? అని ప్రశ్నించారు. ఫామ్ హౌజ్ లో ఆర్టిస్టులు కూర్చొని అందమైన అబద్దాన్ని వీడియోలో చూపించారన్న కిషన్ రెడ్డి.. కేసీఆర్ చూపిన వీడియోలో ఏముందో అర్ధం కాలేదని కిషన్ రెడ్డి అన్నారు.