KTR: తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక అన్ని పార్టీల మధ్య కాకరేపుతోంది. అన్ని పార్టీలు మునుగోడును సొంతం చేసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుండి గతంలో గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. బీజేపీ నుండి పోటీ చేస్తుండటం తెలిసిందే. అయితే ఆ స్థానాన్ని హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది.
మునుగోడు ఉప ఎన్నిక ప్రధానంగా బీజేపీకి, టీఆర్ఎస్ కు అన్నట్టు సాగుతోంది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మునుగోడులో మకాం వేయనుండగా.. టీఆర్ఎస్ నుండి కేటీఆర్, హరీష్ రావులు మునుగోడులోనే ఉండనున్నారు. ఇలా రెండు పార్టీలకు చెందిన కీలక నాయకులు అంతా మునుగోడులో ఉండి.. తమతమ పార్టీలను గెలిపించుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
KTR:
ఈక్రమంలోనే తాజాగా కేటీఆర్ ఫోన్ చేసినట్లు ఓ ఆడియో వాయిస్ కాల్ వైరల్ అవుతోంది. అందులో మునుగోడుకు చెందిన ఓ బీజేపీ నేతకు కేటీఆర్ ఫోన్ చేశాడని, తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని అందులో చెబుతున్నట్లు ఉంది. బీజేపీ ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్న వెంకటేశం అనే నాయకుడికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్వయంగా ఫోన్ చేసి.. ఈసారి మునుగోడు ఉపఎన్నికల్లో మీ సపోర్ట్ టీఆర్ఎస్కు ఇవ్వండి అని కోరుతున్న ఆడియో వాయిస్ వైరల్ అవుతోంది.
బీజేపీ నేతను బతిమిలాడుతున్న కెటిఆర్ ! ఆడియో లీక్ | News18 Telugu pic.twitter.com/j3KM6XRAdD
— News18 Telugu (@News18Telugu) October 18, 2022
కాగా ఇది ఫేక్ అని, వాయిస్ డబ్బింగ్ చేశారని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. కేటీఆర్ స్థాయి వ్యక్తి ప్రాధేయపడటం ఏంటని మండిపడుతున్నారు. మునుగోడులో పంచడానికి బీజేపీ నేతలు తెస్తున్న డబ్బులో కోటి రూపాయలు తాజాగా పోలీసుల తనిఖీల్లో బయటపడిందని, దానిని జీర్ణించుకోలేక ఇలాంటి డ్రామాలు చేస్తున్నారంటూ టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. కానీ బీజేపీ నేతలు మాత్రం టీఆర్ఎస్ నేతలకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే ఇలా చేస్తున్నారని అంటున్నారు.