Nitish Kumar : బిహార్ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. నిన్నటి వరకూ నివురుగప్పిన నిప్పులా ఉన్న బిహార్ రాజకీయం నేడు క్లైమాక్స్కు చేరుకుంది. దీంతో బిహార్ రాజకీయం క్షణక్షణానికి ఉత్కంఠగా మారుతోంది. బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యు)నేత నీతీశ్ కుమార్… ఎన్డీఏ కూటమి నుంచి వైదొలగే యోచనలో ఉన్నారంటూ ఒక్కసారిగా వార్తలు గుప్పుమనడంతో పొలిటికల్ హీట్ ప్రారంభమైంది. నేడు అధికార, ప్రతిపక్ష పార్టీలు కీలక సమావేశాలు నిర్వహించాయి. ఈ నేపథ్యంలోనే సీఎం నీతీశ్ కుమార్ నేడు గవర్నర్ను కలిసే అవకాశమున్నట్లు వార్తలు వస్తున్నాయి.
నేటి సాయంత్రం నీతీశ్ వెంట ఆర్జేడీ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ కూడా రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ను కలవనున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గవర్నర్ఫాగు చౌహన్ను కలిసేందుకు ఈ సాయంత్రం 4 గంటలకు నీతీశ్ అపాయింట్మెంట్ తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. బీజేపీతో తాము పొత్తు వీడుతున్నామని గవర్నర్కు ఆయన అధికారికంగా చెబుతారని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అదే జరిగితే.. నీతీశ్ ప్రభుత్వం మైనార్టీలో పడటం ఖాయం. దీంతో ప్రతిపక్ష ఆర్జేడీ, కాంగ్రెస్లతో కలిసి ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి.
Nitish Kumar : నితీశ్కు మద్దతు తెలుపుతూ సంతకాలు..
ఇక బీజేపీతో తెగదెంపులు అంటే ప్రతిపక్షాలన్నీ జేడీయూకి అండగా నిలిచేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే నితీశ్కు మద్దతు విషయమై అటు ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీల మహాగట్బంధన్ కూటమి ఎమ్మెల్యేలు రబ్రీదేవీ నివాసంలో భేటీ అయ్యారు. ఇటు నితీశ్ కూడా తమ పార్టీ నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీతీశ్ కుమార్ ఉండేలా మద్దతు తెలుపుతూ ప్రతిపక్ష నేతలు లేఖపై సంతకాలు చేశారు. ఈ లేఖను ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్కు అందజేశారు. మరోవైపు బీజేపీ నేతలు సైతం పరిస్థితిని ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ఉప ముఖ్యమంత్రి తార్కిశోర్ ప్రసాద్ నివాసంలో బీజేపీ కీలక నేతలు సమావేశమయ్యారు. నీతీశ్ మంత్రివర్గంలో ఉన్న మొత్తం 16 మంది బీజేపీ మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.