ఏపీ రాజకీయాలలో ఎన్నికలకి మరో రెండేళ్ల సమయం ఉండగానే అప్పుడే పార్టీల మధ్య యుద్ధవాతావరణం నెలకొని ఉంది. ఎవరికి వారు ప్రజలతో మెప్పు పొందడానికి తమ ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార పార్టీ గడపగడపకి అంటూ తాము చేపట్టిన సంక్షేమ పథకాలతో ప్రజల మధ్యకి వచ్చారు. మరో వైపు ప్రతిపక్ష టీడీపీ కూడా ప్రభుత్వ వైఫల్యాలని ఎత్తి చూపిస్తూ ప్రజల మధ్యనే పోరాటాలు చేస్తుంది. ఇక మూడో ప్రత్యామ్నాయంగా ఉన్న జనసేన పార్టీ కూడా ఈ మధ్యకాలంలో విస్తృత కార్యక్రమాలతో ప్రజలకి చేరువ అయ్యే ప్రయత్నం చేస్తుంది. జనసేన నియోజకవర్గ నాయకులు ప్రజల మధ్య తిరుగుతున్నారు. అలాగే తరుచుగా మీడియా ముందుకి వచ్చి అధికార పార్టీ వైఫల్యాలపై విమర్శలు చేస్తున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే 2014 ఫలితాలు మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాలని అనుకుంటున్నారు. ఈ నేపధ్యంలో అప్పుడు చేసిన లోపాలని సరిచేసుకుంటూ జనసేన ప్లీనరీ తర్వాత చురుకుగా రాజకీయ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకి చేరువ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రజల సమస్యలపై వినతులు స్వీకరించేందుకు, వారి ఎదుర్కొంటున్న ఇబ్బందులని తెలుసుకోవడానికి ప్రతి ఆదివారం జనవాణి పేరుతో గ్రీవెన్స్ నిర్వహిస్తున్నారు.
దీనికి ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తుంది. ప్రజలు రకరకాల సమస్యలతో పవన్ కళ్యాణ్ ని కలిసి వారి బాధలు విన్నవించుకుంటున్నారు. వీటిపై పవన్ కళ్యాణ్ కూడా పభుత్వాన్ని గట్టిగానే నిలదేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ప్రభుత్వం పై ఎలాంటి విమర్శలు చేసిన వెంటనే మాజీ మంత్రి పేర్ని నాని మీడియా ముందుకి వచ్చి పవన్ పై ఘాటు వ్యాఖ్యలతో విరుచుకు పడతారు. తాజాగా మరోసారి జనవాణి కార్యక్రమంపై పేర్ని నాని తనదైన శైలిలో వ్యంగ్యంగా విమర్శలు చేసారు. పవన్ కళ్యాణ్ కి వీకెండ్ పొలిటీషియన్ పేరు కరెక్ట్ గా సరిపోతుందని అన్నారు. షూటింగ్ లు చేసుకుంటూ ఖాళీ సమయంలో ఇలా జనవాణి అంటూ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ షూటింగ్ లతో పాటు రాజకీయాలు చేయడం కూడా ఆలస్యమే అని పేర్ని నాని దయ్యబట్టారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలలో 95 శాతం ఇప్పటికే పూర్తి చేసిందని అన్నారు. అలాగే విద్య, వైద్య రంగాలలో ముఖ్యమంత్రి జగన్ ఎన్నడూ లేని విధంగా విప్లవాత్మకమైన మార్పులకి శ్రీకారం చుట్టారని అన్నారు. వైసీపీ పాలన విశ్వసనీయతకి నిదర్శనం అని చెప్పారు. పవన్ అసెంబ్లీ గేటు మళ్ళీ ముట్టుకోవాలా లేదా అనేది త్వరలోనే ప్రజలు నిర్ణయిస్తారని అన్నారు. మొత్తానికి పేర్ని నాని పవన్ కళ్యాణ్ పై చేసిన వీకెండ్ పొలిటీషియన్ విమర్శలు రాజకీయ వర్గాలలో మరోసారి చర్చనీయాంశంగా మారాయి.