Producers Protest : టాలీవుడ్ చరిత్రలోనే అరుదైన ఘటన చోటు చేసుకుంది. కనీవినీ ఎరుగని రీతిలో నిర్మాతలే బంద్కి పిలుపునివ్వడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. టాలీవుడ్లో సమ్మె గంట మోగింది. ఆగస్టు 1 నుంచి షూటింగులు నిలిపివేస్తున్నామని నిర్మాతలు ప్రకటించారు. నిర్మాతలకు ఏం సమస్యలుంటాయి? వాళ్లెందుకు బంద్కు దిగడం? అంటే వారికీ సమస్యలున్నాయి. నిర్మాణ వ్యయం ఆకాశాన్నంటుతోంది. దాన్ని అదుపులో పెట్టుకునే దారేది? కోటి రూపాయలతో మొదలు పెట్టిన సినిమా 2-3 కోట్లు అవుతోంది. మరి కళ్లెం ఎక్కడ? అయితే చిత్రసీమలో సమస్యలు లేవా? అంటే సర్వసాధారణం. అయితే సమస్య వచ్చీరాగానే.. ఇండస్ట్రీ పెద్దలు రంగంలోకి దిగి.. సమస్యని పరిష్కరించడం జరుగుతోంది. అది కుదరని పక్షంలో బంద్లు తప్పవు.
Producers Protest : రెమ్యూనరేషన్ తగ్గించుకోమంటే ఓకే అనేస్తారా?
అయితే ఇప్పటి వరకూ తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని.. నిర్మాతలపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు సినీ కార్మికులు సమ్మె చేస్తే.. ఇప్పుడు ఏకంగా నిర్మాతలే బంద్కి దిగడం చర్చనీయాంశంగా మారింది. నిర్మాణ వ్యయాన్ని అదుపులో పెట్టాలంటే.. ముందు హీరోల పారితోషికాలకు కళ్లెం వేయాల్సిందే. మరి అది జరుగుతుందా? రెమ్యూనరేషన్ పెంచుకోవడానికి మాత్రమే ఇష్టపడే హీరోలు.. తగ్గించుకోమంటే ఓకే అనేస్తారా? ఇటీవల ఓ అగ్ర దర్శకుడు ఇద్దరు స్టార్ హీరోలతో రూ.150 కోట్ల బడ్జెట్తో ఓ సినిమా తీశారు. ఈ సినిమాలో నటించినందుకు గానూ.. హీరోలిద్దరూ చెరొక రూ.50 కోట్లు తీసుకున్నారు. తీరా సినిమా విడుదలై థియేటర్లలో అయితే కేవలం రూ.10 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. మరి ఇలా అయితే నిర్మాతల పరిస్థితేంటి? ఏం చేసి ఆ లోటును పూడ్చుకోవాలి.
ఒకప్పుడంటే జనం పొద్దున లేస్తే సినిమా హాలు ముందుండేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. అంతా ఓటీటీకి ఎడిక్ట్ అయిపోయారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా జనం మాత్రం థియేటర్ల వైపు చూడటం లేదు. మరి ఇలాంటప్పుడు సినిమా వ్యయం తగ్గించుకోవడం మినహా మరో మార్గం లేదు. ఇది చాలదన్నట్టు పాన్ ఇండియా మూవీస్. అబ్బో అక్కడ సినిమా హిట్ అయితే హీరో రెమ్యునరేషన్ ఆకాశాన్నంటాల్సిందే. ప్రభాస్ ఏకంగా రూ.100 కోట్లు పారితోషికం తీసుకుంటున్నాడు. ఇక మహేష్ బాబు రూ.60 కోట్లు. వీరి తర్వాతే మిగిలిన హీరోలంతా. పాన్ ఇండియా మూవీ కానీ ఫట్ అన్నదో నిర్మాత పాతాళానికి చేరుకోవాల్సిందే. అందుకే హీరోల రెమ్యూనరేషన్ తొలుత తగ్గించుకోవాలని నిర్మాతలు కోరుతున్నారు. మరి దీనికి మన హీరోలు ఏమంటారో చూడాలి.