ఈ నెల 27 నుంచి నారా లోకేష్ ఏపీలో యువగళం పేరుతో పాదయాత్ర మొదలు పెట్టబోతున్న సంగతి తెలిసిందే. ఈ పాదయాత్ర కుప్పం నుంచి నారా లోకేష్ మొదలు పెట్టబోతున్నాడు. ముఖ్యంగా యువత, మహిళలకి భరోసా కల్పించే విధంగా పాదయాత్ర రూట్ మ్యాప్ ని లోకేష్ సిద్ధం చేసుకున్నాడు. గత కొంత కాలం ఈ పాదయాత్ర మీదనే లోకేష్ దృష్టి మొత్తం పెట్టాడు. ప్రత్యేకంగా ఒక టీమ్ ని ఏర్పాటు చేసుకొని ఆ పాదయాత్ర ప్రణాళికని లోకేష్ దగ్గరుండి సిద్ధం చేసుకున్నారు. ఇదిలా ఉంటే ఈ పాదయాత్రలో ప్రతి నియోజకవర్గాన్ని లోకేష్ టచ్ చేయబోతున్నారు. అలాగే ఇదే యాత్రలో తన మీద ఉన్న నెగిటివ్ అభిప్రాయాన్ని కూడా తుడిచేసుకునే ప్రయత్నం లోకేష్ చేయనున్నారు.
ఇంతకాలం లోకేష్ ఎక్కువగా మంగళగిరి, గుంటూరు, పల్నాడు జిల్లాలకి మాత్రమే ఎక్కువ పరిమితం అయ్యారు. కోస్తా, ఉత్తరాంద్ర జిల్లాలలో పర్యటించింది చాలా తక్కువ. అయితే ఈ సారి మాత్రం తనలోని నాయకత్వ లక్షణాలు ప్రజలకి చూపించుకోవడానికి లోకేష్ ఈ యాత్రని ఉపయోగించుకుంటున్నారు. ఇదిలా ఉంటే నారా లోకేష్ యాత్ర కోసం టీడీపీలో సీనియర్ నాయకులు అందరూ కూడా అండగా ఉండటం విశేషం. ప్రతి జిల్లాలో ఉన్న సీనియర్ నాయకులని నారా లోకేష్ కలుపుకొని వెళ్ళడానికి సిద్ధం అవుతున్నారు. ఈ నేపధ్యంలో పయ్యావుల కేశవ్, గంటా శ్రీనివాసరావు, యనమల రామకృష్ణుడు లాంటి నేతలని నారా లోకేష్ కలుసుకున్నారు.
ఇక వారు కూడా నారా లోకేష్ కి ఈ యాత్ర విషయంలో దిశానిర్దేశ్యం చేసినట్లు తెలుస్తుంది. తాజాగా యనమల రామకృష్ణుడు నారా లోకేష్ యువగళం యాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ యువగళం యాత్ర ద్వారా లోకేష్ యువతకి భరోసా ఇవ్వబోతున్నారని అన్నారు. ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం యువతని మోసం చేసిందని అన్నారు. అలాగే తాము తీసుకొచ్చిన నిరుద్యోగ భ్రుతిని కూడా జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలగించారని అన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత యువత కోసం ఏం చేయబోతున్నది ఈ యాత్ర ద్వారా లోకేష్ తెలియజేస్తారని యనమల రామకృష్ణుడు తెలిపారు.