ఏపీ రాజకీయాలలో రాబోయే ఎన్నికలే లక్ష్యంగా అన్ని పార్టీలు ఎవరికీ వారు కొత్త సమీకరణాలు వేసుకుంటూ ముందుకి వెళ్తున్నారు. ప్రధానంగా ఉన్న మూడు పార్టీలు తమ బలనిరూపణ కోసం గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీ అయితే రానున్న ఎన్నికలలో ఏకంగా 175 స్థానాలు తమవే అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత రోజు రోజుకి పెరిగిపోతుందని అది తమకి అడ్వాంటేజ్ గా మారుతుందని టీడీపీ భావిస్తుంది. ఈ సారి ఒంటరిగానే అధికారంలోకి వస్తామని ఓ వైపు చెబుతూనే మరో వైపు జనసేనతో పొత్తు కోసం ఎదురుచూస్తుంది. అయితే జనసేన పార్టీ మాత్రం ముఖ్యమంత్రి పదవి పవన్ కళ్యాణ్ కి ఇవ్వడానికి అంగీకరిస్తేనే టీడీపీతో పొత్తు అని స్పష్టంగా చెబుతున్నారు.
ఈ సారి తమ బలం కూడా బాగానే పెరిగిందని జనసేన నాయకత్వం భావిస్తుంది. ఇదిలా ఉంటే ఏపీలో అసలు బలమే లేని బీజేపీ పార్టీతో మాత్రం మూడు పార్టీలు మిత్రుత్వాన్ని కోరుకుంటున్నాయి. కేంద్రంలో బీజేపీ పార్టీకి ఏపీలో అధికార వైసీపీ అన్ని విషయాలలో కూడా ఎలాంటి కండిషన్ లేకుండా మద్దతు ప్రకటిస్తుంది. వారు పెట్టిన బిల్లులకి కూడా మద్దతుగా నిలబడుతుంది. తాజాగా రాష్ట్రపతి ఎన్నికలలో బీజేపీకి వైసీపీ పార్టీ సపోర్ట్ అవసరం ఉంది. ఈ నేపధ్యంలో ప్రత్యేక హోదా డిమాండ్ మళ్ళీ తెరపైకి వచ్చింది. అయితే వైసీపీ నాయకత్వం మాత్రం ఎలాంటి డిమాండ్స్ లేకుండానే ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్మూకి మద్దతు ప్రకటించింది. ఇక ఏపీలో అధికార వైసీపీకి, కేంద్రంలో బీజేపీకి బద్ధ శత్రువుగా ఉన్న టీడీపీ పార్టీ కూడా రాష్ట్రపతి విషయంలో ద్రౌపదికి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ఆమెని మర్యాదపూర్వకంగా కలిసి మరి మద్దతు తెలిపారు.
ఇక ఈ రాష్ట్రపతి ఎన్నిక ద్వారా బీజేపీ పార్టీకి టీడీపీ దగ్గరయ్యే ప్రయత్నాలు మొదలు పెట్టిందనే టాక్ ఇప్పుడు రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. వచ్చే ఎన్నికలలో కూడా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం వినిపించడంతో ఎన్డీఏ కూటమిలో మళ్ళీ భాగం కావడంతో ఆ పార్టీకి దగ్గర అవ్వాలని బాబు భావిస్తున్నట్లు రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట. అయితే బీజేపీకి దగ్గర కావాలనే బాబు ప్రయత్నానికి ఆ పార్టీ నుంచి మాత్రం అడ్డంకులు ఎదురవుతున్నాయి. దానికి చాలా కారణాలు కూడా ఉన్నాయి. రానున్న ఎన్నికలలో వైసీపీ, టీడీపీకి ప్రత్యామ్నాయంగా జనసేనతో కలిసి వెళ్లాలని బీజేపీ భావిస్తుంది. మరి భవిష్యత్తులో ఈ సమీకరణాలు ఏ విధంగా మారుతాయి అనేది వేచి చూడాలి.