Temple Dhvaja Sthambham: ప్రతి దేవాలయం ముందు తప్పకుండ దర్శనమిచ్చేది ధ్వజస్తంభం. ధ్వజం అనగా జెండా లేదా పతాకం. ధ్వజం (పతాకం) కట్టి ఎగురవేసే స్థంభం కావున ధ్వజస్తంభానికి అలా పేరు వచ్చింది. ఇక ధ్వజస్తంభాన్ని మూలస్తంభం గా కూడా పేర్కొంటారు. ఇది ఆలయ ప్రధాన ద్వారానికి అభిముఖంగా కొంత ఎత్తులో ఉంటుంది. చిరుగంటలు గంటలు కలిగి, ఆలయ కీర్తి పతాకాన్ని ఎగురవేస్తూ ఉంటుంది.
యూపస్తంభం ఇప్పుడు ధ్వజస్తంభంగా..
పూర్వం యాగశాలలు గా ఉన్నవి తర్వాతి రోజుల్లో ఆలయాలుగా మార్చబడ్డాయి. ఈ క్రమంలో యూపస్తంభములు ధ్వజస్తంభంగా మార్పు చెందాయని చెబుతారు పెద్దలు. ఇక ఈ ధ్వజస్తంభం త్రిమూర్తుల సమిష్టి తత్వంగా భావిస్తారు. ధ్వజస్తంభంపైన మూడు పలకలు, మూడు శిఖరాలు ఉంటాయి. ఇక ధ్వజస్తంభం నిర్మాణంలో ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో చిన్న తేడా గమనించవచ్చు.
దక్షిణ భారతదేశంలో ఆలయ ఉత్తరాన గోపురం దాటి లోపలికి రాగానే ఉంటుంది ధ్వజస్తంభం, ఇక ఉత్తరాన మాత్రం ఆలయ విమానంపైనే స్థాపించడం మనం చూడవచ్చు. ధ్వజస్తంభం ఎలా ఉండాలి అనే దాని గురించి శాస్త్రాల్లో వివరణ ఇవ్వబడింది. దీనికి నాలుగు రకాలుగా చెప్పారు. ఇక పూర్వం ఆలయ నాలుగు దిక్కులా నాలుగు ధ్వజస్తంభాలు ఉండేవని తెలుస్తోంది.
ఆలయం గోపురమంత, శిఖరమంత, పైకప్పు సమానంగా ధ్వజస్తంభం ఉండవచ్చు. ధ్వజస్తంభాన్ని చందనం, దేవదారు, ఎర్రచందనం, టేకు కలపతో నిర్మిస్తారు. ఇక దేవాలయం లోనికి వెళ్లలేని వారు ధ్వజస్తంభానికి నమస్కారం చేసినా దైవదర్శన ఫలితం కలుగుతుందని ఆగమశాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ధ్వజస్తంభానికి మనస్ఫూర్తిగా మొక్కినవారి కోరికలు ఫలిస్తాయని విశ్వసిస్తారు భక్తులు.