Dolo-650 : డోలో–650 ఎం.జీ. ట్యాబ్లెట్ల విషయంలో విచారిస్తున్న కొద్దీ సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. కొవిడ్తో కొట్టుమిట్టాడుతున్న దేశ ప్రజలకు సంజీవని ఔషధం ఇదేనంటూ వైద్యులు సైతం పెద్ద ఎత్తున ఊదరగొట్టారు. చివరికి వ్యాక్సిన్ వేసుకున్న వారు సైతం జ్వర లక్షణాలు కానీ.. పెయిన్స్ కానీ ఉంటే డోలో తప్ప వేరొక ట్యాబ్లెట్ వేసుకోవద్దంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ ప్రచారం చేసినందుకు గానూ.. సదరు సంస్థ రూ.1000 కోట్ల తాయిలాలు ఇచ్చిందంటూ ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎంఎస్ఆర్ఏఐ) అనే స్వచ్ఛంద సంస్థ ఆరోపించింది.
సెంట్రల్ బోర్డు ఫర్ డైరెక్ట్ ట్యాక్సెస్(సీబీడీటీ) ఇటీవల డోలో–650 ఎం.జీ సంస్థల్లో నిర్వహించిన సోదాల్లో ఈ విషయం బహిర్గితమైందని సుప్రీంకోర్టుకు తెలిపింది. తమ సంస్థ ఔషధాలు రోగులకు సూచించాలంటూ వైద్యులకు ప్రోత్సాహకాలు అందిస్తున్న ఫార్మాస్యూటికల్ సంస్థలను బాధ్యులను చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఎఫ్ఎంఆర్ఏఐ వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై గురువారం జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఏఎస్ బోపన్నల ధర్మాసనం విచారించింది. ఈ మేరకు సంస్థ తరఫు లాయర్లు సంజయ్ పారిఖ్, అపర్ణా భట్లు గురువారం సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు.
Dolo-650 : వైద్యులకు రూ.1,000 కోట్ల తాయిలాలు ఇచ్చారు..
కాగా.. ‘ట్యాబ్లెట్ల 500 ఎం.జీ. పరిమాణం వరకూ మార్కెట్ ధరను నియంత్రించే అధికారం ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. అంతకు మించిన ఎం.జీ అయితే ఆ ట్యాబ్లెట్ల తయారీదారుల ఇష్టానుసారం ధర నిర్ణయించుకుంటారు. దీంతో అధిక లాభాలను మూటకట్టుకునేందుకు 650 ఎం.జీ డోస్ ఉన్న తమ సంస్థ ట్యాబ్లెట్లనే రోగులకు సూచించాలని డోలో–650 తయారీదారులు వైద్యులకు రూ.1,000 కోట్ల తాయిలాలు ఇచ్చారని లాయర్లు కోర్టుకు తెలిపారు. ఫార్మా స్యూటికల్ సంస్థల అనైతిక మార్కెటింగ్ పద్ధతులు రోజురోజుకీ పెరుగుతున్నాయని, అధిక/అహేతుక ఔషధాల ప్రిస్కిప్షన్, అధిక ధర ఉన్న ఔషధాలనే రోగులకు వైద్యులు సూచించే పద్ధతులు పెరిగాయన్నారు.