దేశీయ స్టాక్ మార్కెట్లు రెండో రోజు కూడా నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం తర్వాత క్రమ క్రమంగా నష్టాల్లోకి వెళ్లిపోయాయి. ఉక్రెయిన్ – రష్యా యుద్ధం నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకుల్లో కొనసాగుతున్నాయి. ఆరంభంలో భారీ లాభాల్లో ఉన్న సూచీలు.. కొద్దిసేపటికే కిందకి దిగాయి. ఇరు దేశాల మధ్య బాంబుల మోతలకు తోడు క్రూడాయిల్ ధరలు భగ్గుమనడం మదుపరులను కలవరపెడుతుంది.
నిఫ్టీలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ , విప్రో, టెక్ మహీంద్రా, ఐటీసీ, హెచ్ సీఎల్ టెక్ షేర్లు పెరిగితే.. అల్ట్రా టెక్ సిమెంట్ , ఏషియన్ పెయింట్స్ , హిందుస్థాన్ యూనిలీవర్ , డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, మారుతీ కింద పడిపోయాయి. ఆటో, క్యాపిటల్ గూడ్స్ & బ్యాంక్ రంగాలలో 1-2 శాతం పడిపోగా, ఎఫ్ఎంసిజి & రియాల్టీ సూచీలు ఒక్కొక్కటి 0.5 శాతం తగ్గాయి. అయితే మెటల్, ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్ సూచీలు 1-2 శాతం పైకివెళ్ళాయి. బిఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.6 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.35 శాతం పైకివెళ్ళాయి.