ఉక్రెయిన్-రష్యా యుద్ధ ప్రభావం స్టాక్ మార్కెట్లపై గట్టిగానే పడింది. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ పతనానికి గురైయ్యాయి. సూచీలు భారీగా నష్టపోవడంతో ఇన్వెస్టర్లు రూ.13 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు క్రమ క్రమంగా పడిపోతూ చివరకు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఆరంభంలోనే 1800 పాయింట్లకుపైగా నష్టంతో ప్రారంభమైంది. 55 వేల 997 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. ఆఖర్లో 2,850 పాయింట్లు పతనమై 54 వేల 383 వద్ద కనిష్ఠాన్ని నమోదు చేసింది.
ముగింపులో, సెన్సెక్స్ 2,702.15 పాయింట్లు (4.72%) క్షీణించి 54,529.91 వద్ద స్థిర పడితే, నిఫ్టీ 815.30 పాయింట్లు(4.78%) నష్టపోయి 16,248.00 వద్ద ముగిసింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ భారీగా పెరిగి రూ.75.69 వద్ద ఉంది. ఈరోజు నిఫ్టీ, సెన్సెక్స్లో ఏ ఒక్క షేరు కూడా లాభపడలేదు. టాటా మోటార్స్ 10 శాతానికిపైగా పడిపోయింది. యూపీఎల్, ఇండస్ఇండ్ బ్యాంక్, గ్రేసిమ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, యాక్సిస్ బ్యాంక్, ఎం అండ్ ఎం, ఐఆర్సీటీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 6 శాతానికిపైగా డీలాపడ్డాయి. అన్ని సెక్టోరల్ సూచీలు 3-8 శాతం నష్టంతో ముగిశాయి. దాదాపు అన్ని రంగాల సూచీలు 2-6 శాతం మేర పడిపోయాయి.బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 5 శాతం చొప్పున పతనమయ్యాయి.