గత కొంత కాలంలో టాలీవుడ్ గడ్డుకాలం ఎదుర్కొంటుంది. ఓ వైపు టికెట్ ధరలు పెంచి సినిమాపై పెట్టిన పెట్టుబడి తిరిగి తెచ్చుకోవాలని అనుకున్నారు. అయితే సినిమా టికెట్ ధరల పెరుగుదల తర్వాత థియేటర్స్ కి వెళ్లి సినిమా చూసే ఆడియన్స్ తగ్గిపోయారు. ఫ్యామిలీ నలుగురు వెళ్లి చూడాలంటే కనీసం 2 వేల రూపాయిల వరకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంత పెట్టి థియేటర్స్ కి వెళ్లి సినిమా చూడటం కంటే ఓటీటీలో వచ్చాక తీరిగ్గా చూసుకోవచ్చనే నిర్ణయానికి చాలా మంది ప్రేక్షకులు వచ్చేశారు. ఏదో స్టార్ హీరోల సినిమాలు అయితే తప్ప ఫస్ట్ డే కలెక్షన్స్ రావడం లేదు. హిట్ టాక్ వచ్చిన కూడా లాంగ్ రన్ లో పెట్టుబడి తిరిగి రావడం లేదు. అయితే ఓటీటీ రిలీజ్ ఉండటం వలన కొంత సేఫ్ జోన్ లో ఉండగలుగుతున్నారు. మరో వైపు సినిమాలపై పైరసీ ప్రభావం కూడా భారీగానే ఉంది.
ఇక హీరోల రెమ్యునరేషన్ లు కూడా భారీ ఉండటంతో స్టార్స్ తో సినిమా చేయాలంటే వంద కోట్లకి పైగా బడ్జెట్ పెట్టుకోవాల్సి వస్తుంది. అయితే ఆ బడ్జెట్ పెట్టిన తిరిగి వస్తుందో లేదో అనే భయం నిర్మాతలని వెంటాడుతుంది. అందుకే పాన్ ఇండియా వైడ్ గా స్టార్ హీరోలు తమ సినిమాలని రిలీజ్ చేసుకొని కలెక్షన్స్ రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక టెక్నీషియన్స్, పోస్ట్ ప్రొడక్షన్ ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. ఈ నేపధ్యంలో గత కొంత కాలంగా నిర్మాతలు బడ్జెట్ కంట్రోల్ పై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఏవీ కూడా ఒక కొలిక్కి రాలేదు. ఇక తాజాగా మరోసారి బడా నిర్మాతలతో పాటు చిన్న నిర్మాతలు కూడా సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా ఆగస్టు 1 నుంచి షూటింగ్ లు అన్ని బంద్ చేసి ఇతర విషయాలపై చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక బడ్జెట్ కంట్రోల్ కి సంబంధించి అన్ని విషయాలు పరిష్కారం అయ్యాకనే మళ్ళీ షూటింగ్స్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. ఈ బంద్ ప్రభావం ముఖ్యంగా స్టార్ హీరోల మీద ఎక్కువగా పడే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభాస్ సలార్, మెగాస్టార్ కొత్త సినిమాలు, అలాగే బాలకృష్ణ సినిమా, పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మరికొన్ని సినిమా షూటింగ్స్ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు వాయిదా పడనున్నాయి. మరి ఈ బంద్ ప్రభావం టాలీవుడ్ పై ఎన్ని రోజులు కొనసాగుతుంది అనేది వేచి చూడాలి. ముఖ్యంగా హీరోల రెమ్యునరేషన్ విషయంలో కోత విధించే అవకాశం ఉందనే టాక్ బలంగా వినిపిస్తుంది.