సినీ నటుడు, నందమూరి ఫ్యామిలీ హీరో తారకరత్న హాట్ స్ట్రోక్ తో బెంగళూరులో నారాయణ హృదయాలయలో ట్రీట్మెంట్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. గత వారం రోజుల నుంచి అతనికి అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నారు. హెల్త్ కండిషన్ సీరియస్ గా ఉండడంతో వైద్య బృందం నిరంతర పర్యవేక్షణ చేస్తూ వెంటిలేషన్ పైన ఆయనకు ట్రీట్మెంట్ అందిస్తూ ఉండడం గమనార్హం. ఇక తారకరత్న వేగంగా కోలుకోవాలని నందమూరి అభిమానులతో పాటు టిడిపి కార్యకర్తలు కూడా ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్ల బృందం తెలియజేసింది. అతని శరీరం ట్రీట్మెంట్ కు సహకరిస్తుందని, అయితే కోలుకోవడానికి మరి కొంత సమయం పడుతుంది అని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.
బాలకృష్ణ దగ్గరుండి తారకరత్న ట్రీట్మెంట్ సంగతి చూసుకుంటున్నారు. డాక్టర్ తో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఆయన కండిషన్ పై అప్డేట్ ఇవ్వడంతో పాటు మరింత మెరుగైన వైద్యం కోసం ఉన్నత స్థాయి వైద్యులను కూడా రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా తారకరత్నని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా పరామర్శించారు. ఎంపీ విజయసాయి రెడ్డికి తారకరత్న వరుసకు అల్లుడు అవుతాడు. తారకరత్న భార్యకి విజయసాయిరెడ్డి పెదనాన్న. ఈ నేపథ్యంలోనే తాజాగా విజయసాయిరెడ్డి నారాయణ హృదయాలయకి వెళ్లి తారకరత్న కండిషన్ గురించి తెలుసుకున్నారు.
అనంతరం బయటకు వచ్చి అతని కండిషన్ మెరుగైనట్లు మీడియాకు తెలియజేశారు. అదే సమయంలో దగ్గరుండి తారకరత్న ట్రీట్మెంట్ సంగతి చూసుకుంటున్న బాలకృష్ణకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయడం విశేషం. ఇప్పటికే నందమూరి కుటుంబం అందరూ కూడా బెంగళూరు వెళ్లి తారకరత్నను పరామర్శించారు. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కూడా బెంగళూరు వెళ్లి తారకరత్న కండిషన్ తెలుసుకున్నారు. తారకరత్న వేగంగా కోలుకోవాలని ఆకాంక్షించారు. చంద్రబాబు నాయుడు కూడా ఎప్పటికప్పుడు డాక్టర్లకు ఫోన్ చేస్తూ తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.