YSRCP: అధికార పార్టీ వైసీపీ మూడు రాజధానుల అజెండాతో ప్రస్తుతం ముందుకి వెళ్ళడంతో పాటు దానిని ప్రజలకి చేరువ చేసే ప్రయత్నం కూడా మొదలు పెట్టింది. అలాగే విశాఖని అంతర్జాతీయ నగరంగా తీర్దిదిద్దాలని ముఖ్యమంత్రి జగన్ ఆలోచిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే అభివృద్ధిలో దూసుకుపోతున్న విశాఖపట్నంని పరిపాలనా రాజధానిగా చేశారు. ఇలా విశాఖపట్నంని రాజధానిగా చూపించడం వలన పెట్టుబడులు కూడా వస్తాయని భావిస్తున్నారు. దేశంలో ప్రస్తుతం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా విశాఖపట్నం ఉంది. ఈ నేపధ్యంలో పెట్టుబడిదారులు కూడా విశాఖపట్నం వైపు చూస్తున్నారు.
దీనిని దృష్టిలో ఉంచుకొని జీ20 సమ్మిట్ కూడా విశాఖపట్నం ఆతిధ్యం ఇవ్వబోతుంది. ఇందులో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ పారిశ్రామిక వేత్తలు పాల్గొనే అవకాశం ఉందని భావిస్తున్నారు. వారి ద్వారా విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టించాలని చూస్తున్నారు. భారీ పరిశ్రమలకి విశాఖపట్నం అనువైన ప్రాంతంగా చూపించడానికి సిద్ధం అవుతున్నారు. పారిశ్రామికీకరణలో వెనుకబడిందని ప్రతిపక్షాల ఆరోపణలకి వైసీపీ అధిష్టానం ఈ సమ్మిట్ ద్వారా సమాధానం చెప్పడానికి సిద్ధం అవుతుందని తెలుస్తుంది. లక్షల కోట్ల పెట్టుబడులని ఆకర్షించడంతో పాటు వారికి సింగిల్ విండో విధానం ద్వారా 20 రోజుల్లో అనుమతులు ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే మరో వైపు ఉగాది నుంచి విశాఖపట్నం కేంద్రంగా పరిపాలన సాగించాలని ముఖ్యమంత్రి జగన్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక వారంలో రెండు రోజులు విశాఖపట్నంలోనే ఉంటూ పరిపాలన చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. అలాగే ఒక రోజు పల్లెనిద్ర చేయడానికి తన ప్రచారం వ్యూహంలో భాగంగా సిద్ధం అవుతున్నారు. మరో మూడు రోజులు అమరావతిలో ఉండేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా ఈ ఉగాది తర్వాత నుంచి మాత్రం విశాఖపట్నం కేంద్రంగా పాలనని కొనసాగించడం పక్కా అనే మాట వినిపిస్తుంది.