మాచర్లలో ప్రస్తుతం వైసీపీ కార్యకర్తలు సృష్టించిన అరాచకం చూస్తూ ఉంటే నితిన్ మాచర్ల నియోజకవర్గం సినిమా గుర్తుకొస్తుంది అని చెప్పాలి. టీడీపీ నేతలే లక్ష్యంగా వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున విద్వంసం సృష్టించారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ చార్జ్ బ్రహ్మారెడ్డిని వైసీపీ అనుచరులు అందరూ టార్గెట్ చేసి అతని ఇంటిని ద్వంసం చేశారు. అలాగే టీడీపీ ఆఫీస్ ని తగలబెట్టారు. అలాగే బ్రహ్మారెడ్డి కారుని కూడా ద్వంసం చేసి తగలబెట్టారు. వైసీపీ కార్యకర్తలు అర్ధరాత్రి అరాచకం చూస్తూ ఉంటే పోలీసులు మాత్రం ఏమీ చేయలేని నిస్సహాయతలో ఉండిపోయారనే మాట వినిపిస్తుంది. బ్రహ్మారెడ్డి ఇంట్లో ఫర్నీచర్ కూడా బయటకి తీసుకొచ్చి ద్వంసం చేశారు. పదుల సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలపై కూడా కర్రలతో, రాళ్ళతో దాడి చేసి గాయపరచడం విశేషం.
దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించారు. మాచర్లలో జరిగిన ఘటనని తీవ్రంగా ఖండించారు. వైసీపీ అరాచకానికి మాచర్ల నియోజకవర్గం సజీవ సాక్ష్యంగా ఉందని పేర్కొన్నారు. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా డిమాండ్ చేశారు. ఇక పోలీసులు ఇప్పటికే పట్టణంలో 144 సెక్షన్ విధించారు. అయితే పోలీసులు మాత్రం దీనిని కేవలం ఫ్యాక్షన్ గొడవలుగా చెబుతున్నారు. అదే సమయంలో తప్పంతా టీడీపీ నేత బ్రహ్మారెడ్డి వైపు ఉందని చూపించే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు టీడీపీ నుంచి వినిపిస్తున్నాయి.
బ్రహ్మారెడ్డిపై కేసు నమోదు చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది. టీడీపీ చేస్తున్న ఇదేం ఖర్మరా బాబు కార్యక్రమం చేస్తున్న సమయంలో వైసీపీ దానిని అడ్డుకొని రెచ్చగొట్టడంతో పాటు టీడీపీ నాయకుల ఇళ్ళకి నిప్పు పెట్టారు. అసలు దీనిని రాజకీయ కోణంలో చూపించే ప్రయత్నం మాత్రం పోలీసులు చేయడం లేదు. కాని టీడీపీ నాయకులు, కార్యకర్తలని లక్ష్యంగా చేసుకొని వైసీపీ కార్యకర్తలు దాడులు చేసారనే టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఈ ఘటన మాచర్లలో భయానక వాతావరణాన్ని సృష్టించింది.