ఏపీ రాజకీయాలలో ప్రధాన ప్రతి పక్షాలతో పాటు అధికార పార్టీ వైసీపీ కూడా రానున్న ఎన్నికలే లక్ష్యంగా తమ వ్యూహాలని సిద్ధం చేసుకొని అడుగులు వేస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ గడపగడపకి మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టారు. అయితే అందులో వచ్చిన ఫీడ్ బ్యాక్ బట్టి ఎప్పటికప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికి తలంటు పెడుతున్నాడు. కచ్చితంగా వచ్చే ఎన్నికలలో క్లీన్ స్వీప్ చేయాలని అల్టిమేటం జారీ చేస్తున్నాడు. అయితే ఎమ్మెల్యేలకి గ్రామాలలో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. ఈ నేపధ్యంలో మరింత వ్యతిరేకత పెరగకుండా జగన్ రెడ్డి వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ వారాహి, లోకేష్ పాదయాత్రని కచ్చితంగా అడ్డుకోవాలని భావిస్తున్నారు. దీనికోసం ఏదో ఒకటి చేయాలని భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే మరో వైపు ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ల మీద ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఎక్కడైతే ఉందో అక్కడ వారి స్థానంలో కొత్తవారిని ఎమ్మెల్యేలుగా నిలబెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలకి ఈ విషయాన్ని జగన్ చెప్పేసినట్లు తెలుస్తుంది. ఈ నేపధ్యంలో చాలా మంది ఎమ్మెల్యేలు తమకి సీటు రాకపోతే ప్రత్యామ్నాయంగా తమ కుటుంబంలోని వారికే ఎమ్మెల్యే టికెట్ ఖరారు అయ్యే విధంగా పావులు కదుపుతున్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరావు తాజాగా ఓ మీటింగ్ లో మాట్లాడుతూ తనకి వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యే టికెట్ రాకపోవచ్చు అని కామెంట్స్ చేశారు.
తన స్థానంలో తన భార్య నిలబడుతుంది అని తెలిపారు. ఇక మచిలీపట్నంలో పేర్ని నాని తప్పుకొని తన కొడుకు పేర్ని కట్టుని ఎమ్మెల్యేగా నిలబెట్టదానికి గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. చాలా మంది నాయకులు తమ వారసులని రాజకీయ అరంగేట్రం 2024లో చేయించాలని భావిస్తున్నారు. జగన్ ని ప్రసన్నం చేసుకొని ఆ కుటుంబం నుంచి ఎమ్మెల్యే టికెట్ పోకుండా కాపాడుకోవాలని అనుకుంటున్నారు. జగన్ కూడా వ్యతిరేకత ఉన్నచోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేల కుటుంబంలోని వారికి టికెట్లు ఖరారు చేసి సామాజిక సమీకరణాలు అనే కవరింగ్ ఇచ్చే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తుంది.