జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి కౌలు రైతు భరోసా యాత్రకి పిలుపునిచ్చారు. ఈ నెల 18న గుంటూరు సత్తెనపల్లి నియోజకవర్గంలో ఈ యాత్రలో భాగంగా చనిపోయిన కౌలు రైతుల కుటుంబాలకి తలో లక్ష రూపాయిలు ఆర్ధిక సాయం చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఈ కౌలు రైతు భరోసా యాత్ర జనసేనానికి మంచి పాజిటివ్ వైబ్ తీసుకొచ్చింది. ఈ నేపధ్యంలో కౌలు రైతు భరోసా యాత్రకి వైసీపీ నుంచి అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉందా అంటే అవుననే మాట వినిపిస్తుంది. ఇప్పటికే ఏపీలో వైసీపీ అధినేత జగన్ ఎమ్మెల్యేలు అందరికి అల్టిమేటం జారీ చేసి ఈ సారి భారీగా సీట్లు సంపాదించాలని సూచించారు. ఒక్క ఓటు కూడా పోడానికి వీలు లేదని చెబుతున్నాడు. అలాగే ఎమ్మెల్యేలు అందరూ అవినీతికి దూరంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.
ప్రజలని ఆకట్టుకునే ప్రయత్నంలో నాయకులు, ఎమ్మెల్యేలు అందరూ దృష్టి పెట్టాలని సూచించారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ బస్సు యాత్రకి సిద్ధం అవుతున్న నేపధ్యంలో కాపునాడు వేదికగా అన్ని పార్టీలలో ఉన్న కాపు నేతలంతా కలుస్తున్నారు. ఈ సారి కాపు ప్రజలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ ని సీఎంని చేసుకోవడమే లక్ష్యంగా పని చేయాలని కాపునాడు నేతలు పిలుపునిస్తున్నారు. గుంటూరులో కన్నా లక్ష్మినారాయణని నాదెండ్ల మనోహర్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆ తర్వాత గంటా శ్రీనివాసరావు కూడా కన్నాతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వీరు బయటకి కేవలం మర్యాదపూర్వకంగా కలిసామని చెబుతున్న కూడా అంతర్ఘతంగా వైసీపీలో తతస్టంగా ఉన్న కాపు నేతలు చూపు కూడా ఇప్పుడు జనసేన వైపు ఉందని, వారందరూ ఏకమయ్యే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది.
జనసేనాని కూడా వారి రాకకి గేట్లు తెరిచి ఉంచారనే మాట వినిపిస్తుంది. ఈ నేపధ్యంలో సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే ఒకరు జనసేనలో చేరడానికి సిద్ధం అయ్యారని టాక్. పవన్ కౌలు రైతు భరోసా యాత్రలో ఆయన పార్టీలో చేరుతారని టాక్. అంబటి రాంబాబుకి తన నియోజకవర్గంలోనే పవన్ కళ్యాణ్ చుక్కలు చూపించబోతున్నాడు అనే మాట జనసైనికులలో వినిపిస్తుంది. దీనికి ప్రతిగా వైసీపీ కూడా వ్యూహాత్మక అడుగులు వేస్తుంది. జనసేనకి చేరువ అవ్వబోతున్నారు అనే మాట వినిపిస్తున్న నాయకులతో పార్టీలోకి కీలక నేతలు టచ్ లోకి వెళ్లి వారిని ఏదో ఒక రకంగా ప్రలోభ పెట్టె ప్రయత్నం చేస్తున్నారని వినికిడి.
తాజాగా సజ్జల కూడా పవన్ కళ్యాణ్ కౌలురైతు భరోసా యాత్రపై కొంత సానుకూలంగా స్పందించారు. కౌలు రైతులకి వైసీపీ ప్రభుత్వం అన్ని విధాలుగా సాయం చేస్తుందని, ఇంకా ఏవైనా కార్యాచరణ ఉంటే పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి సూచించాలని కోరారు. ఆ సూచనలు సరైనవిగా ఉంటే కచ్చితంగా తీసుకుంటామని కూడా చెబుతున్నారు. ఓ వైపు పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా బాణాలు సందిస్తూ అతని ఇగోని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూనే మరో వైపు శాంతి వచనాలు కూడా వైసీపీ నేతలు చేయడం వెనుక చాలా పెద్ద వ్యూహమే ఉందనే మాట వినిపిస్తుంది.