YS Jagan: దేశంలో అతి పెద్ద స్కామ్ లలో స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కూడా ఒకటని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. దీని ద్వారా వచ్చిన నిధులు అన్ని కూడా చంద్రబాబు ఖాతాలలోకి షెల్ కంపెనీల ద్వారా ట్రాన్స్ ఫర్ అయ్యాయని పేర్కొన్నారు. ఈ కుంభకోణం చాలా పద్ధతి ప్రకారం జరిగిందని, దీని నుంచి ఎట్టి పరిస్థితిలో చంద్రబాబు తప్పించుకాలేరు అని అసెంబ్లీలో జగన్ ఆధారాలతో సహా బయటపెట్టారు. ఈ స్కాంను నడిపింది సాక్షాత్తు చంద్రబాబు. అందుకు ఆధారాలు కూడా ఉన్నాయి. 371 కోట్లు షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబు వద్దకు వచ్చింది. దోచేసిన డబ్బు జేబులోకి ఎలా తెచ్చుకోవాలో చంద్రబాబుకు బాగా తెలుసు అని జగన్ విమర్శించారు. నేను బటన్ నొక్కితే ప్రజల ఖాతాల్లోకి సొమ్ము వెళుతుంది. కాని చంద్రబాబు బటన్ నొక్కితే ఆయన ఖాతాలోకి డబ్బులు వస్తాయిని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ఈ స్కాం ఊపిరి పోసుకుంది. ఈ స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు కోసం చంద్రబాబు టెండర్ల ప్రక్రియ కూడా చేపట్టలేదు. సీమెన్స్ కంపెనీలోని వ్యక్తితో లాలూచీ పడ్డారు. 90 శాతం సీమెన్స్, 10 శాతం ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. సీమెన్స్ సుమారు రూ.3 వేల కోట్లు ఇస్తుందని ప్రచారం చేశారు. ఒక కంపెనీ ఎక్కడైనా రూ.3 వేల కోట్ల గ్రాంట్ ఇస్తుందా? ఈ ప్రాజెక్టుకు డీపీఆర్ కూడా చేయించలేదు. ఇంత పెద్ద మొత్తంలో ప్రజాధనం దోపిడీకి గురవుతుంటే ఒక్కరూ మాట్లాడలేదు.
ఈ స్కాంను మించిన అవినీతి ఎక్కడా చూడం. క్యాబినెట్ లో నిర్ణయించిన మేరకు జీవో ఇచ్చారు. అయితే జీవోలో ఒకలాగా ఉంటే, ఒప్పందంలో మరొకలాగా ఉంటుంది. 6 క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని జీవోలో చెప్పారు. ఒక్కో క్లస్టర్ కు రూ.546 కోట్లు ఖర్చు చేస్తామని అన్నారు. జీవోకు, ఒప్పందానికి ఎక్కడా పొంతన లేదు. జీవో స్వరూపాన్ని మొత్తం మార్చేశారని పేర్కొన్నారు. ఆర్థికసాయం కింద రూ.330 కోట్లు ఇచ్చేట్టు మార్పులు చేశారు. స్కాంకు ఇక్కడ బీజం పడింది. చంద్రబాబు పాత్ర లేకుండా ఇంతపెద్ద స్కామ్ జరిగే అవకాశమే లేదని జగన్ పేర్కొన్నారు. ఈ కుంభకోణం ఆధారాలతో సహా బయటకి వస్తుందని జగన్ అసెంబ్లీలో పేర్కొనడం విశేషం.