Charminar : గోకుల్ చాట్ బాంబు పేలుళ్ల అనంతరం హైదరాబాద్ వాసులు ఏ చిన్న బాంబు బెదిరింపు వార్త విన్నా కూడా చిగురుటాకులా వణికిపోతున్నారు. తాజాగా ఓ ఆగంతకుడు అత్యంత రద్దీ ప్రాంతమైన చార్మినార్ వద్ద బాంబు పెట్టినట్టు పోలీసులకు సమాచారం అందించాడు. అంతే పోలీసులు వెంటనే అలర్ట్ అయిపోయారు. బాంబు స్క్వాడ్ సహా క్షణాల్లో అక్కడ వాలిపోయారు. చార్మినార్ పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుని.. అక్కడ ఉన్న వారందరీని అక్కడి నుంచి పంపించేశారు.
చార్మినార్ పరిసరాల్లో ఉన్న ఫుట్పాత్ వ్యాపారులను సైతం క్షణాల్లో ఖాళీ చేయించేసి అక్కడి నుంచి పంపించేశారు. బాంబు స్క్వాడ్లను దింపి తనిఖీలు చేపట్టారు. అయితే ఇప్పటి వరకూ బాంబు ఉన్న ఆనవాళ్లేమీ కనిపించలేదు. నిజంగా బాంబు పెట్టారా? లేదంటే కేవలం అది బెదిరింపు కాలేనా? అన్నది తెలియాల్సి ఉంది. అసలు బాంబు పెట్టినట్టు కాల్ ఎవరు చేశారు? ఎక్కడి నుంచి ఆ ఫోన్ వచ్చింది? అనే విషయాలపై పోలీసులు విచారణ ప్రారంభించారు. జనసందోహం చాలా ఎక్కువగా ఉండే ప్రాంతం కావడంతో పోలీసులు ఏమాత్రం ఛాన్స్ తీసుకోవడం లేదు.
ఈ నెల 16న కూడా ఇలాగే బాంబు ఉందంటూ పోలీసులకు ఒక బెదిరింపు కాల్ వచ్చింది. ఐఎస్ సదన్ కూడలిలో మందిరం-మసీదు దగ్గర బాంబు ఉందని పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు. అర్ధరాత్రి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఎంత వెదికినా కూడా బాంబు తాలూకు ఆధారాలేమీ దొరకలేదు. ఇక ఆ తరువాత ఫోన్ చేసిన వ్యక్తి ఆచూకీ కనుగొన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించి అది ఫేక్ కాల్గా పోలీసులు తేల్చారు. మరి ఈ రోజు కూడా అలాంటి ఫేక్ కాలే వచ్చిందో.. అసలు కాల్ చేసిన వ్యక్తి ఎవరో తేలాల్సి ఉంది.