పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిస్తున్న సినిమా “బ్రో” ఈనెల 28న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ,టీజర్,పాటలతో ఇప్పటికే మూవీపై భారీగా అంచనాలు పెంచేశాయి. ప్రధానంగా సినిమాకి థమన్ సంగీతం హైలెట్ గా నిలిచింది. తాజాగా ప్రి రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేదికగా పవన్ కళ్యాణ్ బ్రో మూవీతో సమా పలు ఆసక్తికర విషయాల గురించి మాట్లాడారు.
ఇంతటి అభిమానం, ప్రేమను సినిమాలే ఇచ్చాయన్నారు పవన్. ఇది తాను కోరుకున్న జీవితం కాదని.. భగవంతుడు ఇచ్చిన డెస్టిని అని పేర్కొన్నారు. సమాజానికి ఏదైనా ఇవ్వాలనే ఆలోచనతో పుట్టిన సినిమా బ్రో. కరోనా సమయంలో పాలిటిక్స్ తిరగలేక, ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రముఖ దర్శకుడు, సన్నిహిత మిత్రుడు త్రివిక్రమ్ ఈ కథ గురించి చెప్పారని.. చాలా నమ్మకంతో సినిమా చేశామని పేర్కొన్నారు.
సముద్ర ఖని రాసిన మూలకథకు త్రివిక్రమ్ రాసిన సరికొత్త స్క్రీన్ ప్లే అందించారు. అభిమానులు నన్ను ఎలా చూడాలను కున్నారో అదే విదంగా ఈ కథను డిజైన్ చేశారు. ఈ సినిమా తరువాత సముద్ర ఖనికి అభిమానిని అయిపోయాను. ఎందుకంటే మనలో చాలా మందికి తెలుగు భాష సరిగ్గా మాట్లాడటం రాదు. సగం ఇంగ్లీషు, సగం తెలుగుతో టింగ్లిష్ మాట్లాడతాం. ఈ విషయంలో నన్ను నేను ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ ఉంటాను. సముద్రఖని గారిది మన భాష,మన యాసకాదు.. కానీ స్క్రిప్ట్ రీడింగ్ సమయంలో ఆయన తెలుగులో చదవడం చూసి ఆశ్చర్యపోయాను.
“ వాస్తవానికి ఇది 50 నుంచి 70 రోజులు చేయాల్సిన సినిమా. కానీ నా రాజకీయ ప్రయాణంలో కుదరడం లేదు. నాకు సినిమా అంటే చాలా ఇష్టం. రామ్ చరణ్,ఎన్టీఆర్ ల మాదిరిగా డ్యాన్స్ చేయకపోవచ్చు గాని సినీ పరిశ్రమ ఏ ఒక్కరిదో కాదు.. నా ఊహల్లో హీరో అంటే చిరంజీవి గారే. ఏదో చిన్నపాటి ఉద్యోగం చేస్తూ.. పొలంలో పని చేద్దామనుకున్నాను. కానీ ఆలోచనలు మనస్ఫూర్తిగా బ్రేక్ చేసింది మా వదిన గారు. సుస్వాగతం సమయంలో జగదాంబ సెంటర్ లో డబుల్ డెక్కర్ బస్సు పైకి డ్యాన్స్ చేయమంటే చచ్చిపోయాను. అందరి ముందు చేయాలంటే నేను సిగ్గుపడిపోయాను. అప్పుడు వెంటనే మా వదినకు ఫోన్ చేసి నువ్వు నన్ను ఎందుకు అనవసరంగా ఎగదోచావ్.. శుభ్రంగా వదిలేసి ఉంటే ఎవరికీ కనిపించకుండా మారుమూలన ఎక్కడో బతికే వాడిని కదా.. ఆరోజు మా వదిన చేసిన తప్పు.. ఈ రోజు మీ ముందు నన్ను ఇలా నిలబెట్టింది. మా వదిన ఆ తప్పు చేయకుంటే నా పాటికి నేను చిన్న జీవితం జీవించే వాడిని. మా వదిన చేసిన చేసిన ద్రోహం ఈరోజు నేను మాటల్లో వర్ణించలేను. నేను ఏది కూడా గ్రాంటెడ్ గా తీసుకోను. మెగాస్టార్ చిరంజీవి 10 శాతం కస్టపడితే.. నేను ఆయనకు మించి కష్టపడాలనుకొని.. ఒళ్లు కూడా పగులకొట్టించుకొనేవాడిని” అంటూ చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్.