Bandi Sanjay: తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక అన్ని పార్టీల్లోనూ ఎంతో ఉత్కంఠతను రేపింది. అన్ని పార్టీలు చావో రేవో అన్నట్లు తలపడ్డాయి. మరీ ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీల మధ్య పోటీ.. హోరాహోరీగా సాగింది. మునుగోడు స్థానానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసినప్పటి నుండి అన్ని పార్టీలు ఈ స్థానాన్ని కైవలం చేసుకోవాలని ప్రయత్నించాయి. అందులో భాగంగా అన్ని పార్టీలు తీవ్రంగా ప్రచారం చేశాయి.
మొత్తానికి మునుగోడు స్థానాన్నిగులాబీ పార్టీ తమ ఖాతాలో వేసేసుకుంది. టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన కూసుకుంట్ల విజేతగా నిలిచారు. అయితే ఈ విజయం మీద ఒక్కో పార్టీ నేత ఒక్కోలా స్పందించాడు. టీఆర్ఎస్ కు గట్టి పోటీనిచ్చిన బీజేపీ అభ్యర్థి.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నైతిక విజయం తనదే అని ప్రకటించారు. ఇక ఈ ఉప ఎన్నిక మీద తెలంగాణ బీజేపీ చీఫ్ కూడా స్పందించారు.
మునుగోడులో తామే విజయం సాధించామని చెప్పుకొచ్చిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్.. టీఆర్ఎస్ బెదిరింపులు, ప్రలోభాలకు పాల్పడ్డట్లు ఆరోపించారు. మునుగోడులో ఒక్క అభ్యర్థి గెలుపు కోసం సీఎం, 17 మంది మంత్రులు, 86 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పని చేశారని అన్నారు. ఇంత మంది పని చేసినా కానీ నామమాత్రపు మెజార్టీతోనే టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు సాధించారని అన్నారు. బీజేపీ కోసం కార్యకర్తలు అహర్నిశలు పని చేశారని, వారందరికీ ధన్యవాదాలు తెలిపారు బండి సంజయ్.
Bandi Sanjay:
మునుగోడు ఉప ఎన్నికలో గెలుపు కోసం టీఆర్ఎస్ మద్యాన్ని ఏరులై పారించిందని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు. ఒక్క అభ్యర్థి కోసం ఏకంగా రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేశారని.. మునుగోడు ప్రజలంతా బీజేపీ వెంట ఉన్నారని అన్నారు. కాగా గతంలో బీజేపీకి కనీసం డిపాజిట్ కూడా దక్కకపోగా.. తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరికతో.. బీజేపీ బాగా పుంజుకుంది.