ఈసారి ఇంకో సున్నా పెంచేశారు టీపీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో ఒక్క ఎకరం అమ్మితే.. ఆంధ్రప్రదేశ్లో పది ఎకరాలు కొనొచ్చని గతంలోనూ కీలక వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు.. ఇప్పుడు హైదరాబాద్లో ఒక ఎకరా అమ్మితే ఆంధ్ర ప్రదేశ్లో 100 ఎకరాలు కొనే పరిస్థితి వచ్చిందన్నారు.
గతంలో చేసిన ఈ వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే .. మరోసారి బాబు ఈ వ్యాఖ్యలు చేయటం చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు ఆంధ్రాలో ఒక ఎకరం అమ్మి హైదరాబాద్లో 4 ఎకరాలు కొనే వారని.. మరి ఇప్పుడు హైదరాబాద్లో ఒక ఎకరా అమ్మితే ఆంధ్రాలో 100 ఎకరాలు కొనే పరిస్థితి వచ్చిందన్నారు. దీనికి కారణం ఎవరంటూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. అయితే.. గతంలోనూ చంద్రబాబు భూముల రేట్లపై కీలక వ్యాఖ్యలు చేయగా.. వాటిపై రెండు రాష్ట్రాల నేతల మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే.
ఇక ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అయితే.. విశాఖపట్నంలో ఒక ఎకరం భూమిని అమ్మితే.. తెలంగాణలో ఏకంగా 150 ఎకరాల స్థలం కొనొచ్చంటూ కౌంటర్ వేశారు. హైదరాబాద్ దాటితే.. తెలంగాణలో భూములకు ఎక్కడ విలువుందంటూ.. ఎద్దేవా చేశారు. కాగా.. ఇప్పుడు మళ్లీ నాయుడు చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల్లో ఎలాంటి దుమారం లేపనున్నాయో చూడాలి. మరోవైపు.. ఏపీ సీఎం జగన్ మీద తీవ్ర విమర్శలు చేశారు చంద్రబాబు. అమరావతి రైతులపై జగన్కు ఎందుకు కక్ష.. అంటూ నిలదీశారు.