తెలంగాణలో ఎన్నికల సమయం సమీపిస్తుండగా .. రాష్ట్రంలో అన్ని చోట్ల ఎన్నికల వాతావరణం మెుదలైంది. గెలుపే లక్ష్యంగా పార్టీ లు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. హ్యాట్రిక్పై కన్నేసిన బీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాల అమలులో వేగం పెంచగా.. కర్ణాటకలో అధికారం కోల్పోయిన బీజేపీ సౌత్లో పాగా వేయాలని చూస్తోంది.
ఎన్నికలకు ముందు అనూహ్యంగా పుంజుకున్న టీ కాంగ్రెస్ ఆ దూకుడును కొనసాగించే ప్రయత్నాలు గట్టిగానే చేస్తుంది. ఇక తెలంగాణ ఇచ్చిన పార్టీగా అధికారం చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ వేగంగా పావులు కదుపుతోంది. కర్ణాటక విజయంతో ఎన్నికలకు ముందు అనూహ్యంగా పుంజుకున్న టీ కాంగ్రెస్ ఆ దూకుడును కొనసాగించే ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. ఇతర పార్టీల నేతలను పార్టీలో చేర్చుకుంటుంది. ఇదే దూకుడుతో సమీకరణాలు, వ్యూహాలు మాత్రమే కాకుండా అభ్యర్థుల ఎంపికను కూడా కాంగ్రెస్ వేగవంతం చేసింది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో (2018) జరిగిన తప్పుని తిరిగి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసింది. తొందరలోనే 80 సీట్లల్లో అభ్యర్థులను ప్రకటిస్తామని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్రావు ఠాక్రే తెలిపారు.
ఏకాభిప్రాయం కుదిరిన నియోజకవర్గాల్లో ముందుగానే ప్రకటించబోతున్నట్లు తెలిపారు. ఆగస్టు చివరి వారం కల్లా అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. ఈ సారి గులాబీ పార్టీ కంటే ముందే అభ్యర్థులను ప్రకటించాలని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే బీర్ఎస్ పార్టీ కూడా అభ్యర్థుల ప్రకటనపై కసరత్తు మెుదలుపెట్టింది. ఇప్పటికే నియోవజకవర్గాల్లో రెండు, మూడు దఫాలుగా సీఎం కేసీఆర్ రహస్య సర్వే నిర్వహించినట్లు తెలిసింది. మెుత్తం రెండు విడుతలుగా అభ్యర్థుల జాబితా విడుదల చేయాలని.. తొలివిడతలో చాలా వరకు సిట్టింగ్లకు, వ్యతిరేకతలేని ఎమ్మెల్యేలకు టికెట్లు కన్ఫార్మ్ చేయనున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ నెలాఖరులోగా ఫస్ట్ లిస్ట్ విడుదల చేసేందుకు రెడీ అవుతుండగా.. ఈ టికెట్ల విడదుల రేసులో బీజేపీ మాత్రం కాస్త వెనుకబడింది. పోటీ చేసే అభ్యర్థుల జాబితా, విడుదల చేసే అంశాలపై ఆ పార్టీ ప్రస్తుతానికి దృష్టి పెట్టడం లేదు.