Congress ఎంపీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చీఫ్గా ఎంపికైన అనంతరం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. ఇంకేముంది.. పార్టీ రూపురేఖలు మారిపోతాయి. పక్కా అధికారంలోకి రావడం ఖాయమనే టాక్ బలంగా వినిపించింది. ఆ తరువాత రేవంత్ క్యాడర్ ఊహించిన స్థాయిలో ఉత్సాహంగా ముందుకు కదల్లేదు. దీంతో కొంత నిరుత్సాహమైతే వచ్చిందనే చెప్పాలి. ఇటీవలి కాలంలో కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ప్రారంభమయ్యాయి. దీంతో మొత్తానికి రేవంత్ ఏదో చేస్తున్నారనే ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ చాపకింద నీరులా విస్తరిస్తోందనే వాదన కూడా ప్రారంభమైంది. కట్ చేస్తే.. అత్యంత రహస్యంగా పార్టీ కీలక నేతలు సమావేశమవుతుండటం ఆసక్తికరంగా మారింది. ఎవ్వరికీ తెలియనివ్వకుండా సీక్రెట్గా పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ ఒక కారులో రేవంత్ ఇంటికి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.
ఎవరిని కలిశారు?
ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకే తాను బస చేస్తున్న హైదర్గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఒక కారులో అత్యంత రహస్యంగా మాణిక్యం ఠాగూర్ బయటకు వెళ్లడం సంచలనం రేపుతోంది. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో మాణిక్యం ఠాగూర్ ఇంటి నుంచి బయటకు వచ్చి పార్టీ పొలిటికల్ కన్సల్టెంట్ సునీల్ కనుగోలుతో కలిసి రేవంత్ ఇంటికి వెళ్లారు. అక్కడకు చేరికల కమిటీ చీఫ్, మాజీ మంత్రి జానారెడ్డిని కలుసుకుని.. నలుగురూ కలిసి బయటకు వెళ్లిపోయారు. ఎక్కడికి వెళ్లారు? ఈ నలుగురు ఎవరిని కలిశారనేది మాత్రం బిగ్ మిస్టరీ. ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో చేరికలు.. మరోవైపు ఉన్న పార్టీ నేతలను చేజారనీయకుండా చూసుకోవడమనేది మెయిన్ టార్గెట్గా పార్టీ కీలక నేతలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. బీజేపీలో అసంతృప్త నేతలు, అలాగే టీఆర్ఎస్ నేతలే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.
ఆ 7 గంటలూ ఏమయ్యారు?
నిజానికి మాణిక్యం ఠాగూర్ రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు ఏర్పాట్లు, కార్యక్రమాల వివరాలన్నీ పార్టీ ప్రొటోకాల్ విభాగమే చూసుకుంటుంది. ఆయన ఎవరిని కలవాలన్నా, ఎక్కడికి వెళ్లాలన్నా ప్రొటోకాల్ విభాగం నేతలు ఏర్పాట్లు చేస్తారు. కానీ ఆదివారం తెల్లవారు జామున 4 నుంచి 11 గంటల మధ్య మాత్రం ఆయన ప్రోటోకాల్ విభాగానికి సైతం అందుబాటులో లేకుండా పోవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆ ఏడు గంటలు ఆయన ఏమయ్యారు? ఎక్కడికి వెళ్లారు. మొత్తానికి మీడియా కంటపడకుండా అత్యంత రహస్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తోందనడంలో సందేహం లేదు. వీటన్నింటినీ చూస్తే.. కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్లో వేగం పెంచినట్టే కనిపిస్తోంది.