ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో పార్టీలన్నీ వ్యూహలకు మరింత పదునుపెడుతున్నాయి. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. వివిధ సంక్షేమ పథకాలు ప్రకటించడంతో పాటు అభివృద్ధి పనులతో బీఆర్ఎస్ ఎన్నికలకు సిద్దమవుతుండగా.. కాంగ్రెస్ డిక్లరేషన్ల పేరుతో ప్రజలకు వరాలు ప్రకటిస్తోంది. దీంతో బీజేపీ కూడా స్పీడ్ పెంచుతోంది. బండి సంజయ్ను తప్పించి కిషన్ రెడ్డికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన తర్వాత టీ బీజేపీలో కాస్త దూకుడు తగ్గినా.. ఇప్పుడు పుంజుకునేందుకు మళ్లీ ప్రయత్నాలు చేస్తోంది.
ఈ క్రమంలో పార్టీలోని కీలక పోస్టులకు ముఖ్యమైన నేతలను నియమిస్తోంది. తాజాగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్కు తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా బాధ్యతలు స్వీకరించినట్టు సమాచారం. ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీకి మైలేజ్ తెచ్చుకోవాలని చూస్తోంది.
అందుకోసమే సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉన్న అర్వింద్కు ఆ బాధ్యతలు ఇచ్చారు అని సమాచారం. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, పసుపు రైతుల సమస్యలను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లి అర్వింద్ సక్సెస్ అయ్యారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే అర్వింద్.. ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ ఉంటారు. ఇప్పటికే యూట్యూబ్, గూగుల్ యాడ్స్ ద్వారా బీజేపీ క్యాపెయింన్ను ఉధృతం చేసింది. కేసీఆర్ నెరవేర్చని హామీలను షార్ట్ వీడియోల రూపంలో ఆన్లైన్ యాడ్స్ ఇస్తోంది. ఇటీవల యూట్యూబ్లో ఈ యాడ్స్ బాగా పాపులర్ అయ్యాయి. ఎన్నికల వరకు ఈ క్యాంపెయిన్ను కొనసాగించనుంది బిజెపి.