ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిరు వ్యాపారులకు గుడ్న్యూస్ చెప్పారు. జగనన్న తోడు పథకం కింద నిధులు విడుదలకానున్నాయి. . మొత్తం 5,10,412 మంది లబ్ధిదారులకు రూ.560.73 కోట్లు విడుదల చేయనున్నారు. అలాగే రూ.11.03 కోట్ల వడ్డీ రీయంబర్స్ మెంట్ కూడా విడుదల చేయనున్నారు. ఒక్కొక్కరికి రూ.10వేల నుంచి 13వేల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నారు.
తోపుడు బండ్ల వ్యాపారులు, హస్తకళాకారులు, చేతివృత్తుల వారికి అండగా ప్రభుత్వం ఈ నిధుల్ని విడుదల చేస్తోంది. వడ్డీ వ్యాపారుల నుండి చిరు వ్యాపారులను ఆదుకుంటున్నారు. చిరువ్యాపారులకు పెట్టుబడి సాయంగా వడ్డీ లేని రుణాలు అందిస్తున్నారు. జగనన్న తోడు పథకం కింద చిరు వ్యాపారులకు ఎలాంటి పూచీకత్తు లేకుండా తొలిసారి రూ. 10,000 రుణం అందజేస్తారు . ఈ పథకం ద్వారా లబ్ది పొందే వారిలో దాదాపు 85% మహిళలే ఉన్నారు.
ప్రభుత్వం ఈ పథకం ద్వారా ఇప్పటికే ఆరు విడతలుగా చిరు వ్యాపారులకు రుణాలు అందజేసింది. ఇప్పుడు ఏడో విడతలో రుణ పంపిణీ చేస్తున్నారు. ఇలా ప్రతి ఏటా రుణాలు అందజేస్తున్నారు. గత ఆరు విడతల్లో చిరు వ్యాపారులకు 29,16,504 రుణ ఖాతాల ద్వారా రూ. 2406.09 కోట్ల రుణాలను అందజేశారు. జగనన్న తోడు పథకం కోసం గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి.
గ్రామ వాలంటీర్ను సంప్రదించినా పథకానికి సంబంధించిన వివరాలు తెలియజేస్తారు. విద్యుత్ వినియోగం 300 యూనిట్లలోపు ఉండాలి.. ఒకవేళ షాపు ఉంటే కనుక రిజిస్ట్రేషన్ పత్రం కావాలి.. పొలం 10 ఎకరాలకు లోపు ఉండాలి. అర్హుల జాబితా గ్రామ/వార్డు సచివాలయల్లో ప్రదర్శిస్తారు. ఈ పథకం కోసం www.gramawardsachivalayam.ap.gov.in పోర్టల్ ఏర్పాటు చేశారు. అలాగే అర్హతలు ఉండి జాబితాలో పేరు లేనివారు గ్రామ/వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే వెంటనే పరిష్కరిస్తారు.