వాలంటీర్ల క్యారెక్టర్లను పవన్ కళ్యాణ్ తప్పుబట్టి.. వాళ్లను అవమానించడం సిగ్గు చేటన్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. వాలంటీర్లు అమ్మాయిల్ని లోబర్చుకున్నారని విమర్శలు చేస్తున్నారని.. అమ్మాయిల్ని లోబర్చుకోవడం, పెళ్లిళ్లు చేసుకోవడం, కాపురాలు చేయడం, వదిలేయడం దత్తపుత్రుడి క్యారెక్టర్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వెంకటగిరిలో జరిగిన వైఎస్సార్ నేతన్న నేస్తం నిధుల విడుదల సభలో స్ట్రాంగ్ కౌంటరిచ్చారు జగన్. దత్తపుత్రుడు అక్రమ సంబంధం పెట్టుకుంటారు.. అమ్మాయిలను లోబర్చుకుని, వారిని పెళ్లి చేసుకొని, నాలుగేళ్లు కాపురం చేసి విడిచిపెడ్తాడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు.
పైగా ఒకరితో వివాహబంధంలో ఉంటూ ఇంకొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంటారంటూ పవన్పై మండిపడ్డారు. అలాంటి వ్యక్తా వాలంటీర్ల గురించి మాట్లాడేది.. పదేళ్లుగా చంద్రబాబుకు వాలంటీర్గా పని చేస్తున్న ప్యాకేజీ స్టార్ అంటూ ధ్వజమెత్తారు సీఎం. వాలంటీర్ల క్యారెక్టర్ ఎలాంటిదో వాళ్ల నుంచి సేవలు అందుకుంటున్న కోట్ల మందికి తెలుసన్నారు. మంచి చేస్తున్న వ్యవస్థలను, మంచి చేసే మనుషులనూ సంస్కారం ఉన్న ఎవరూ విమర్శించరని.. వాలంటీర్లపై తప్పుడు మాటలకు స్క్రిప్ట్ రామోజీరావుదని.. నిర్మాత చంద్రబాబైతే.. నటన, మాటలు అన్నీ దత్తపుత్రుడివే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వాలంటీర్లలో 60 శాతం మహిళలే ఉన్నారని.. రాష్ట్రంలోని ప్రతి గడపకు సేవలందిస్తున్నారన్నారు. ఎండ, వాన, వరదలను లెక్క చేయకుండా పని చేస్తున్నారని.. ఉదయాన్నే తలుపు తట్టి మంచి చెడులు అడిగితే వాళ్ల గురించి ఇలా మాట్లాడటం దారుణమన్నారు. చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు, సొంత పుత్రుడు, బావమరిది క్యారెక్టర్ ఎలాంటిదో అందరికి తెలుసన్నారు.
ఇది కలియుగం కాక మరేమిటి.. ఇలాంటి వారి మెదడు తెరిచి చూస్తే.. పురుగులు కనిపిస్తాయి. పబ్లిక్ లైఫ్ అయినా అంతే.. పర్సనల్ లైఫ్ అయినా అంతే.. కుళ్లు.. కుట్రలు కనిపిస్తాయి. బీజేపీతో పొత్తు.. చంద్రబాబుతో కాపురం.. చంద్రబాబుపై పోటీ ఒక డ్రామా, బీజేపీతో స్నేహం మరో డ్రామా.. తనది ప్రత్యేక పార్టీ అన్నది ఇంకో డ్రామా.. ఎందుకు ఈస్థాయికి దిగజారిపోయారు. వీళ్లు మంచి చేశారు అని చెప్పుకోవడానికి ఏమీ లేదు” అంటూ సీఎం ధ్వజమెత్తారు.
ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి మరో చర్రిత.. ఇది అందరి బిడ్డ చరిత్ర అన్నారు జగన్. పథకాలు నేరుగా లబ్ధిదారులకు అందించడం గొప్ప కార్యక్రమం అన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయన్నారు. వాలంటీర్లందరూ సేవాభావంతో పనిచేస్తున్నారని.. సేవామిత్ర, సేవా రత్నం, సేవా వజ్రాలను తప్పుబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుసగా ఐదో ఏడాది వైఎస్సార్ నేతన్న నేస్తం అమలు చేస్తున్నామన్నారు సీఎం.