గోవిందరాజులు చెప్పడంతో మల్లిక దగ్గర విగ్రహాన్ని తీసుకొని అలంకరణ పూర్తి చేస్తుంది జానకి. పూజ కోసం పీటల మీద కూర్చొబోతుండగా జానకి, రామాని ఆపి విష్ణు, మల్లికను పూజ చేయమని చెబుతుంది జ్ఞానాంబ. అనంతరం అందరికీ వాయినం ఇస్తారు జానకి, మల్లిక. తర్వాత జానకి అత్తకి కూడా వాయినం ఇవ్వబోతుండగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది జ్ఞానాంబ. ఆ తర్వాత ఆగస్టు 4 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం..
కొడుకు, కోడలు చిన్న తప్పు చేశారని.. పేగుబంధాన్ని తెంచేసుకుంటావా అంటూ జ్ఞానాంబకి హితబోధ చేస్తాడు గోవిందరాజులు. దానికి.. ‘నాకు తెలియకుండా నా కొడుకు నిద్ర కూడా పోడని గుడ్డిగా నమ్మాను. చివరికి వాడు ఈ అమ్మని నిజంగానే గుడ్డిదాన్ని చేశాడు.. వాడికి వాడి భార్య కల అర్ధమైంది కానీ.. వాడికి ఏం కాకూడదని ఈ అమ్మ పడే బాధ మాత్రం అర్ధం కాలేదు. వాడు నన్ను కాదు.. నా ప్రేమను పెంపకాన్నే అవమానించాడు’ అని బాధగా అంటుంది జ్ఞానాంబ. ‘లేదు జ్ఞానం నువ్వు నీ కొడుకుని అపార్ధం చేసుకుంటున్నావ్.. ఇన్ని సంవత్సరాలు పెంచిన నీ కొడుకుని నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేకపోయావు.. నువ్వు నిజంగా వాడిని అర్ధం చేసుకుని ఉంటే.. ఇటు భార్య కల కోసం.. అటు అమ్మకి ఇచ్చిన మాట కోసం వాడు ఎంత నలిగిపోయాడో నీకు అర్థమై ఉండేది. ఇటు నీకు చెప్పే ధైర్యం లేక.. భార్య కన్నీళ్లు చూడలేక వాడిలో వాడు ఎంత నలిగిపోయాడు తెలిసేది. ఎంతసేపూ నీకు చెప్పకుండా భార్యని చదివించాడు.. మోసం చేశాడనే ఆలోచిస్తున్నావ్ తప్పితే.. ఒక్కసారైనా అమ్మకి నిజం చెప్పకుండా దాచినందుకు నీ కొడుకు ఎంత బాధపడి ఉంటాడో ఆలోచించావా? ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడో అర్ధం చేసుకున్నావా? ఒక్క మాట మాత్రం ఖచ్చితంగా చెప్పగలను జ్ఞానం.. ఆ శ్రీరాముడు అయినా తండ్రి మాటను జవదాటతాడేమో కానీ.. నీ కొడుకు మాత్రం తల్లి మాట జవదాటడు.. తన భార్య కలను అందించి దు:ఖాన్ని దూరం చేయాలని అనుకున్నాడే తప్ప.. కన్న తల్లిని మోసం చేయాలని అనుకోడు.. వాడు ప్రాణం పోయినా అలా చేయడు.
నీలో ఉన్న మరో భయం జానకి వాడ్ని మార్చేసిందని.. నీ మాటదాటి ప్రవర్తించేలా నీ కొడుకుని తయారు చేసిందని.. ఒక్కమాట చెప్పు జ్ఞానం.. ఆరోజు గుడిలో మనందరి ప్రాణం కాపాడటానికి తన ప్రాణాలు అడ్డుపెట్టిన అమ్మాయి.. చదువుకున్న అహంకారంతో భర్తని ప్రాణాలు తీసుకునేలా అవమానిస్తుందంటే నమ్ముతున్నావా? ఆ సూర్య చంద్రులు ఎలా వేరు కాదో.. జానకిరాములు కూడా అంతే జ్ఞానం.. ఒకరి కోసం ఒకరు బతుకుతారే తప్ప.. ఒకరిపై ఒకరు అహం చూపించరు.. అందులోనూ మన జానకి.. భర్త గౌరవ మర్యాదల కోసం ఆరాటపడుతుంది తప్పితే.. తక్కువ చేసి చూడదు. అలాంటిదే అయితే.. తన భర్తని వంటల పోటీలకు తీసుకుని వెళ్లి గెలిపించి అందరి ముందు తలెత్తుకునేలా చేయదు కదా’ అని చాలా ఎమోషనల్గా జ్ఞానాంబ చెబుతాడు గోవిందరాజులు.
అది చూసిన మల్లిక.. వేడికి వెన్నపూస కరిగినట్టు.. ఈ పోలేరమ్మ కరిగిపోతుందా? జానకిని క్షమించేస్తుందా? అని తెగ కంగారు పడిపోతుంటుంది. అందుకే మధ్యలో పుల్ల వేద్దామని.. ‘మామయ్య గారూ.. అత్తయ్యకి ఏది మంచో ఏది చెడో బాగా తెలుసు.. ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించే తీసుకుంటారు.. అలాంటి అత్తయ్య గారి నిర్ణయం తప్పని చెప్తే.. ఆమెను అవమానించినట్టే’.. అని అంటుంది మల్లిక. ఆ మాటకి గోవిందరాజులుకి చిర్రెత్తుకు వస్తుంది. దాంతో.. మల్లిక నువ్వు మాట్లాడకు.. నోరు మూసుకుని ఉండు.. మరో మాట మాట్లాడితే బావుండదు అని కోపంగా అరుస్తాడు. అది చూసి జడుసుకుంటుంది మల్లిక. విష్ణు కూడా మల్లిక నోర్మూసుకో లేకపోతే ఒక్కటిస్తానని వార్నింగ్ ఇస్తాడు. ఆ దెబ్బతో ఇంకా బెదిరిపోతుంది మల్లిక.
‘జ్ఞానం.. నువ్వు వీళ్లని క్షమించడం వల్ల పోయిన గతం తిరిగి రాకపోవచ్చు.. కానీ భవిష్యత్ బాగుంటుంది. అందరూ సంతోషంగా ఉంటాం.. దయచేసి అర్థం చేసుకో జ్ఞానం.. అని బ్రతిమిలాడతాడు గోవిందరాజులు. ఇంతలో జానకి వెళ్లి జ్ఞానాంబ కాళ్లపై పడుతుంది. ‘అత్తయ్య గారూ మీకు బాధ కలిగించినందుకు నన్ను క్షమించండి.. అందుకు నాకు ఏ శిక్ష వేసినా భరిస్తాను. కానీ మీరు ఆయనతో మాట్లాడకుండా ఉండొద్దు. అంత పెద్ద శిక్ష ఆయనకి వేయొద్దు.. అమ్మతో మాట్లాడకుండా ఆయన ఉండలేరు. అమ్మ కోపాన్ని ఆయన భరించలేరు. మిమ్మల్ని మా అమ్మ అనుకుని కాళ్లు పట్టుకుని దయచేసి ఆయనతో మాట్లాడండి’ అని ఏడుస్తూ ప్రాధేయపడుతుంది జానకి. ‘కోపం ఉంటే పోయేదాకా కొట్టమ్మా.. కానీ ఇలా మాట్లాడకుండా మాత్రం శిక్షించకమ్మా.. సముద్రమంత బాధను భరించగలను కానీ.. నీ మౌనాన్ని భరించలేను.. నాతో మాట్లాడమ్మా’ అంటూ రామా ఎమోషనల్ అవుతాడు. ఆ మాటలకి జ్ఞానాంబ మనసు కొంచెం మారుతుంది.
పిల్లలను బాధపెట్టడం ధర్మం కాదు జ్ఞానం అని గోవిందరాజులు అనడంతో.. జ్ఞానాంబ మనసు పూర్తిగా మారుతుంది. పంతం కోసం పిల్లల్ని ఇబ్బంది పెట్టడం భావ్యం కాదనుకుని.. జానకి రామాను క్షమించేస్తుంది. అనంతరం జానకి ఇచ్చిన వాయినం తీసుకుంటుంది.. పిల్లా పాపలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండు అని జానకిని ఆశీర్వదిస్తుంది జ్ఞానాంబ. అత్త మారకూడదు అని దేవున్ని వేడుకుంటున్నా మల్లిక దిగాలు పడిపోయి వాళ్లని చూసి కుళ్లుకుంటుంది.
అనంతరం చనిపోయిన అమ్మనాన్నల ఫొటో దగ్గరకు వెళ్లిన జానకి.. చిన్నప్పుడు తాను ఐపీఎస్ అవుతానని తన తండ్రితో చెప్పిన మాటలని గుర్తుచేసుకుంటుంది. ‘నాన్నా ఐపీఎస్ అవ్వాలన్నది నా కల.. కూతుర్ని పోలీస్ ఆఫీసర్గా చూడాలన్నది మీ ఆశ.. నా కోసం ఎంతో కష్టపడ్డారు. కానీ మీ మరణం నా కలల్ని విచ్ఛిన్నం చేసింది. అయినా సరే.. మీ కల నెరవేర్చి మీ ఆత్మకి శాంతి చేకూరుస్తానని.. మీ చితి మంటల సాక్షిగా ప్రమాణం చేశాను. కానీ విధి నన్ను ఓడించింది నాన్నా. అత్తయ్య గారి భయాన్ని పోగొట్టడం కోడలిగా నా బాధ్యత. నన్ను మా అమ్మలా చూసుకున్న అత్తయ్యగారిని బాధ పెట్టడం ధర్మంకాదు కదా. అందుకే నా ఐపీఎస్ కలని వదిలేస్తున్నా.. దయచేసి మీ కూతురి పరిస్థితి అర్ధం చేసుకోండి. మరో జన్మంటూ ఉంటే మీ కడుపున పుట్టి నా మాటని నిలబెట్టుకుంటా.. ఈ జన్మకి మీ కూతుర్ని క్షమించండి నాన్నా’ అంటూ కన్నీటితో తల్లిదండ్రుల ఫొటోని వేసుకుంటుంది. అక్కడే ఉండి జానకి మాటలు వింటున్న రామా షాక్ అవుతాడు. అదే సమయంలో జ్ఞానాంబ సైతం గది బయట నిలుచుని జానకి మాటలు జవిని అలా నిలబడిపోతుంది.
అనంతరం తన ఐపీఎస్ చదువుకి సంబంధించిన పుస్తకాలన్నీ తెచ్చి.. తండ్రి ఫొటో ముందు పెట్టి బాధపడుతుంది జానకి. రామా దగ్గరకు వెళ్లి.. ‘నేను క్షమాపణ చెప్పాల్సిన వాళ్లలో మా నాన్నతో పాటు మీరు కూడా ఉన్నారు.. నా కలను తీర్చడకోసం ఎంతో కష్టపడ్డారు.. మీ అమ్మ దగ్గర దోషిలా మాటలు పడ్డారు. ఇంతలా అర్ధం చేసుకునే భర్త దొరకడం నా అదృష్టం.. మీ కష్టాన్ని నేను వృథా చేస్తున్నందుకు క్షమించండి అని చేతులెత్తి వేడుకుంటుంది జానకి.
అలాంటి నిర్ణయం తీసుకోకండి.. మెల్లగా అమ్మతో మాట్లాడతాను అని రామా అంటాడు. ‘వద్దు రామా గారూ.. మళ్లీ ఈ ప్రస్తావన అత్తయ్య ముందు రాకూడదు.. చేసిన తప్పుని మళ్లీ చేయొద్దు. ఆమె పడిన వేదన చాలు.. పాపాన్ని ఇంకా చేయొద్దు. ఆ పుస్తకాలు నా చదువుకి ఉపయోగపడవు.. వాటిని మన స్వీట్ కొట్టుకి తీసుకు వెళ్లిపోండని అంటుంది. రామా సర్ది చెప్పే ప్రయత్నం చేసినా వినదు జానకి. ఇదంతా వింటున్న జ్ఞానాంబ మనసు మారి జానకిని చదువుకునేందుకు అంగీకరిస్తుందా.. లేక తన భయంతో జానకికి అడ్డు పడుతుందా తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..