24 గంటల కరెంట్ ఇస్తున్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానంటున్న కోమటిరెడ్డి
రాష్ట్రము లో ఏడాది చివరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా రాజకీయంగా వ్యూహాలకు పదనుపెడుతున్నారు.
ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఉచిత కరెంట్ అంశం మీద విమర్శలు, నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ నేతలు, మంత్రులు నిరసనలకు పిలుపునిచ్చి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నేతలు అంతే ధీటుగా వారి విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
తాజాగా ఐటీ మంత్రి కేటీఆర్కు ఎంపీ కోమటిరెడ్డి సవాల్ విసిరారు. 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నట్లు నిరూపిస్తే తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బండ సోమారం గ్రామంలో విద్యుత్ సబ్స్టేషన్ను పరిశీలించిన కోమటిరెడ్డి.. విద్యుత్ సరఫరా తీరును అక్కడి ఆపరేటర్ను అడిగి తెలుసుకున్నారు.
12, 13 గంటలు మాత్రమే ఉచిత విద్యుత్ సరఫరా
రాష్ట్రంలో ఉచిత విద్యుత్ 12 నుంచి 13 గంటలకు మించి సరఫరా జరగటం లేదన్నారు. మధ్య మధ్యలో కరెంటు కోతలు మినహాయిస్తే.. 12 గంటల విద్యుతే రైతులకు అందుతుందన్నారు. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ ఇస్తున్నట్లు నిరూపిస్తే సబ్ స్టేషన్లోనే రాజీనామా చేస్తా. నా సవాల్ను మంత్రి కేటీఆర్ స్వీకరించాలి.
సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ ఎక్కడైనా సరే సబ్ స్టేషన్ కు వెళ్లి అక్కడ లాక్ బుక్కుల్లో 24 గంటలు కరెంట్ ఇస్తున్నట్లు చూపిస్తే జీవితాంతం బీఆర్ఎస్ పార్టీకి సేవ చేస్తా అని, కాంగ్రెస్ చేపట్టిన సత్యగ్రహ దీక్షను భగ్నం చేయడానికి బీఆర్ఎస్ నేతలు ఉచిత కరెంట్ పేరుతో కుట్ర చేస్తున్నారు. రేవంత్ రెడ్డి అనని మాటల్ని అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. ఉచిత విద్యుత్ తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో 10- 12 గంటలకు మించి కరెంటు ఇవ్వడం లేదు. ఈ అంశంపపై దమ్ముంటే బీఆర్ఎస్ నేతలు నా సవాల్ను స్వీకరించాలి.” అని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు.