ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్కు బిగ్ షాక్ తగిలింది. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ముఖ్యనేత కుంభం అనిల్ కుమార్ రెడ్డి కారెక్కారు. సోమవారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
ఎన్నికల నేపథ్యంలో కీలక నేత పార్టీ మారడం కాంగ్రెస్ వర్గాలకు షాక్ అని చెప్పవచ్చు. అయితే భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీరు పట్ల అసంతృప్తితోనే అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ను వీడినట్లు తెలుస్తోంది. గత 2018 ఎన్నికల సమయం నుండే వెంకటరెడ్డితో అనిల్కు మధ్య విభేదాలు మొదలయ్యాయి. గత ఎన్నికల్లో వెంకటరెడ్డి అనుచరులు భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డికి మద్దతు ఇవ్వడం వల్లనే తాను ఓడిపోయినట్లు అనిల్ ఆరోపిస్తున్నాడు.
2019 లోక్సభ ఎన్నికల్లో కోమటిరెడ్డి భువనగిరి పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా గెలిచిన తర్వాత ఇద్దరి మధ్య విబేధాలు మరింత పెరిగాయి. అప్పటి నుంచి ఇద్దరి మధ్య గ్యాప్ మరింత పెరిగింది. అయితే మంత్రి జగదీష్ రెడ్డికి కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమీప బంధువు. ఇదే అవకాశం అని అనిల్ను బీఆర్ఎస్లో కార్ ఎక్కించేందుకు జగదీష్ రెడ్డి ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నా విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ అవకాశం ఇస్తామని పలుమార్లు ఆఫర్ కూడా ప్రకటించారు.
వెంకటరెడ్డితో పొసగకపోవడం, ఇటీవల సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రలో మైక్ ఇవ్వకుండా అవమానించడంతో అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్లో గత కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అంతేకాకుకండా ఇటీవల కాంగ్రెస్ నుంచి భువనగిరి అసెంబ్లీ టికెట్ను బీసీ నేతకు కేటాయించాలని నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు తీర్మానం చేశారు. ఈ పరిణామాల క్రమంలో సోమవారం నియోజకవర్గానికి చెందిన అనుచరులతో అనిల్ కుమార్ రెడ్డి సమావేశం నిర్వహించారు. కార్యకర్తలతో చర్చించిన అనంతరం బీఆర్ఎస్లో చేరనున్నట్లు ప్రకటించారు. అనంతరం జగదీష్ రెడ్డితో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. అనిల్ కుమార్ రెడ్డికి సీఎం కేసీఆర్ గులాబీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు